mt_logo

రేవంత్ రెడ్డి నోటి దురుసు… తెలంగాణ కాంగ్రెస్ లో దుమారం

కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లేకుంటే బ్రాందీ షాప్ నడుపుకునే వాడని పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీలో దుమారం రేగుతోంది. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి న్యూ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తనను బాధించాయని, పిసిసి చీప్ స్థాయిలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. తాను కానీ, తన సోదరుడు కానీ నిజాయితీగా రాజకీయాలు చేశామన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ కాదు బ్రాందీ షాప్ పెట్టుకొనేవారంటూ చులకనగా మాట్లాడడంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ లో పనిచేస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి స్కూల్లో చదువుకుంటున్నారన్నారు. 34 ఏళ్లుగా పార్టీ కోసం తాను తన రక్తాన్ని ధారపోస్తే తనను అవమానించేలా మాట్లాడడాన్ని తప్పు బట్టారు. కాంగ్రెస్ పార్టీ లేకుంటే బ్రాందీ షాపు నడుపుకొనేవారని మాట్లాడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసరంగా తనను రెచ్చగొట్టొద్దని రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. తనను ఒక్క మాట అన్నా కూడా పడనని ఆయన తేల్చి చెప్పారు. టిడిపికి, ఎంఎల్‌ఎ పదవికి కూడా రాజీనామా చేశానని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేశావా అని రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు ఏడాదిపాటు నీవు ఎమ్మెల్యేగా ఉన్నావా లేదా చెప్పాలన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పోరాటానికి సిద్దమయ్యాడన్నారు. ఇష్టం ఉన్న పార్టీలోకి రాజగోపాల్ రెడ్డి పోయాడన్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయమై తనకు సంబంధం లేదన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ కాదు బ్రాందీ షాప్ అనే మాట తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. తాను ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత కాంట్రాక్టులు చేసుకొంటూ కష్టపడి పైకొచ్చానని చెప్పారు.

తాము ఎవరిని కూడా మోసం చేయలేదన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ కాదు బ్రాందీ షాపు అంటూ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు గాను రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. పదవి ఇవ్వకున్నా పార్టీ కోసం తాను పనిచేస్తున్నట్టుగా చెప్పారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకొందో చెప్పాలన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎంతమంది ప్రజాప్రతినిధులు విజయం సాధించారో పరిశీలిస్తే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏమిటో అర్ధమౌతుందన్నారు. తాను తెలంగాణ ఉద్యమకారుడినని చెప్పారు. పార్టీ కోసం 34 ఏళ్లుగా పనిచేస్తున్నానన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా వదులుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయమై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. పార్టీ తనను ఏం చేయాలని ఆదేశిస్తే ఆ పనిచేస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. తమది ఉమ్మడి కుటుంబమని ఆయన చెప్పారు. మునుగోడులో ఏం చేయాలనే విషయమై పార్టీ నాయకత్వం స్ట్రాటజీ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కోమటిరెడ్డి ప్రకటించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *