చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం మిషన్ కాకతీయకు విరాళాల వెల్లువ రోజురోజుకీ పెరుగుతుంది. మంగళవారం క్రెడాయ్ సంస్థ సీఈవో ఎంవీ రాజేశ్వర్ రావు తో పాటు సంస్థ ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసింది. ఈ సందర్భంగా క్రెడాయ్ తరపున రూ. 50 లక్షల చెక్కును అందజేశారు. అంతేకాకుండా సంస్థ తరపున అదనంగా మరో రూ. 50 లక్షల విరాళం భవిష్యత్తులో ఇవ్వనున్నట్లు వారు తెలిపారు.
రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి అనేక సంస్థలతో పాటు వ్యక్తిగతంగా కూడా పలువురు విరాళాలు అందజేస్తున్నారు. కొంతమంది తమ ప్రాంతంలోని చెరువులను దత్తత తీసుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. చెరువుల పునరుద్ధరణకు సంబంధించి తాము బాధ్యత తీసుకుంటున్నట్లు నీటిపారుదల శాఖతో ఒప్పందం కూడా చేసుకున్నారు. చెరువులను దత్తత తీసుకునేందుకు సంస్థ సభ్యులు కొందరు ముందుకు రావడం పట్ల భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు వారిని అభినందించారు.
ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే మీడియాతో మాట్లాడుతూ, చెరువుల పునరుద్ధరణకు ఒప్పందం చేసుకున్న వారికి సుమారు రూ. 2 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని, దీంతోపాటు పునరుద్ధరణ సమయంలో మాన్ పవర్, యంత్రాల ఉపయోగాన్ని లెక్కలోకి తీసుకుంటే రూ. 2 కోట్ల కంటే ఎక్కువగానే ఉంటుందని చెప్పారు.