mt_logo

దేశ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర అత్యవసరమన్న ఆర్జేడీ నేత తేజస్వీ ప్రసాద్ యాదవ్

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ తనయుడు, ఆర్జెడి బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ ప్రసాద్ యాదవ్ సీఎం కేసీఆర్ తో మంగళవారం ప్రగతి భవన్ భేటీ సందర్భంగా పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. తేజస్వీ యాదవ్ తో పాటు మాజీ మంత్రి అబ్దుల్ బారి సిద్దిఖీ, మాజీ ఎమ్మెల్సీ సునిల్ సింగ్, మాజీ ఎమ్మెల్యే భోలా యాదవ్ తో సహా భేటీలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ తదితరు కూడా పాల్గొన్నారు.

బీజేపీ విచ్చిన్నకర అప్రజాస్వామిక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజాస్వామిక లౌకిక శక్తులన్నీ ఏకం కావాల్సిన తక్షణావసరం ఎంతో ఉందని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తేజస్వీ యాదవ్ ల భేటీ సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా,  రైతులు సహా సమస్త వర్గాలకు వ్యతిరేకంగా పని చేస్తున్న బీజేపీ పార్టీని గద్దె దించేంతవరకు పోరాడాల్సిన అవసరమున్నదని… అందుకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణను త్వరలో నిర్ణయించుకోవాలని ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ఇటీవలే ఉభయ కమ్యునిస్టు పార్టీలతో భేటీ అయిన సీఎం కేసీఆర్ బీజేపీ ముక్త్ భారత్ గురించి చర్చించిన విషయం తెలిసిందే. లౌకికవాద ప్రజాస్వామిక శక్తుల ఐక్యసంఘటన దిశగా దేశ రాజకీయ పోరాటాన్ని ఉదృతం చేయాలని తేజస్వీ యాదవ్ తో సీఎం కేసీఆర్ ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. సమావేశంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, తేజస్వీ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ తో సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. వారి ఆరోగ్య క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ ఆర్జెడీ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు మద్దతిచ్చిన విషయాన్ని లాలూ గుర్తు చేస్తూ… జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోశించేందుకు ముందుకు రావాలంటూ సీఎం కేసీఆర్ ను లాలూ ప్రసాద్ యాదవ్ ఆహ్వానించినట్టు సమాచారం. ‘మీరు తెలంగాణ కోసం ఎంతో పోరాడారు. త్యాగం చేశారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. నేడు దేశం గర్వించేలా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తున్నారు. అన్ని మతాలను కులాలను సబ్బండ వర్గాలకు అనుకూలంగా సాగుతున్న మీ పాలనానుభవం దేశానికి అత్యవసరం. జాతీయ రాజకీయాల్లో మీరు తగిన పాత్ర పోశించాలి. లౌకిక ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఆరాచక పాలననుంచి దేశాన్ని రక్షించేందుకు లౌకిక వాద శక్తులన్నీ వొక్కటి కావాలి. దేశాన్ని నాశనం కానివ్వద్దు. అందుకు మీరు ముందుకు రావాలి.’’ అని లాలూ ప్రసాద్ యాదవ్ …సీఎం కేసీఆర్ ను కోరినట్టు సమాచారం.

రాష్ట్రంలో జరుగుతున్న వ్యవసాయాభివృద్ధి కార్యాచరణ గురించి సాగునీటి రంగాభివృద్ధి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై తేజస్వీయాదవ్ అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. దేశ సమగ్రతను కాపాడే దిశగా జాతీయ రాజకీయాలను బలోపేతం చేయాలని, అందుకోసం సాగే బీజేపీ వ్యతిరేక పోరాటంలో కలిసి సాగుతామని తెలిపిన ఆర్జెడీ నేతలు, అందుకోసం సీఎం కేసీఆర్ ప్రధాన పాత్ర పోశించాల్సిన అవసరమున్నదని తేజస్వీ యాదవ్ అన్నట్టు సమాచారం. యూపీ రాజకీయాలల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై ఈ సందర్భంగా చర్చించినట్టు తెలిసింది. యూపీ బీజేపీ ప్రభుత్వం నుంచి ఏకంగా కేబినెట్ మినిష్టర్ తొలగిపోయి పార్టీని వీడడం, వొక్కొక్కరుగా ఎమ్మెల్యేలు బీజేపీని వీడుతుండడం బీజేపీ పతనానికి నాందిగా వారు విశ్లేషించినట్టు సమాచారం. రానున్న యూపీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ కే తమ మద్దతిస్తున్నట్టు సీనియర్ రాజకీయ నేత శరద్ పవార్ ప్రకటించడం ఈ దిశగా గొప్ప పరిణామమని వారు అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. లౌకికవాద ప్రజాస్వామిక శక్తుల పునరేకీకరణ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు తమ ఆర్జెడీ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు వుంటుందని తేజస్వీ యాదవ్ బృందం స్పష్టం చేసినట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *