హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం రోజురోజుకీ పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నగరాభివృద్ధికి, పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు చూసి వివిధ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఎంత ఖర్చయినా సరే కొనేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇందుకు సాక్ష్యం ఐకియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తమ వ్యాపారం కోసం హైదరాబాద్ లో 50 వేల చదరపు మీటర్ల స్థలం కోరింది. దీనిపై టీఎస్ఐఐసీ అధికారులు, ఐకియా కంపెనీ ప్రతినిధులు చర్చలు జరిపారు. రాయదుర్గం పరిధిలోని హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో 25, 26, 27, 29 నంబరు ప్లాట్లను కేటాయించడానికి ఒప్పందం జరిగింది. ఎకరం 19.21 కోట్ల చొప్పున 50 వేల చదరపు మీటర్ల స్థలాన్ని కొనుగోలు చేయడానికి ఐకియా అంగీకరించింది.
రాష్ట్రం విడిపోతే రియల్ ఎస్టేట్ పడిపోతుందని సీమాంధ్ర నేతలు చెప్పినవన్నీ అబద్దాలేనని మరోసారి రుజువైంది. రూ. 500 కోట్ల పెట్టుబడితో ఐకియా సంస్థ స్థాపించే ఈ వ్యాపార కేంద్రం వల్ల తెలంగాణలో ముడిసరుకు సరఫరా చేసే చిన్న వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలమందికి ఉపాధి లభిస్తుంది.