శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ కే కేశవరావు మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ అడ్డుపడటం మూలంగానే సుమారు 15వేలమంది విద్యార్థులు అమరులయ్యారని, తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్న అమరవీరులకు పార్లమెంటులోగానీ, అసెంబ్లీలో గానీ సంతాప తీర్మానం ప్రవేశపెట్టని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు రాగానే అమరుల పేర్లు చెప్పుకుని ఓట్లు పొందాలని చూస్తుందని మండిపడ్డారు.
అమరవీరుల త్యాగాలు, కేసీఆర్ చేపట్టిన ఉద్యమం, ఆమరణ దీక్ష వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ నాయకులు, మంత్రులు అడుగడుగునా అడ్డు తగిలారని, తెలంగాణ వద్దని సోనియాగాంధీతో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం జరిగినంత కాలం పదవులను అంటిపెట్టుకుని ఉద్యమం వైపు కన్నెత్తి చూడని కాంగ్రెస్ నాయకులు తామే తెలంగాణ తెచ్చామని గొప్పలు చెప్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని కేశవరావు అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహారెడ్డి, భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అభ్యర్థి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.