ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ ను పారిస్లో ఓ విశిష్ట వ్యక్తి కలిశారు. ఫ్రాన్స్ లో మూడు దశాబ్దాలకుపైగా తెలుగు భాషపై పరిశోధనచేస్తూ, తెలుగులో అనర్గళంగా మాట్లాడే ప్రొఫెసర్ డానియేల్ నెగర్స్ ఆదివారం మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు. తెలుగుపై నెగర్స్ పట్టును చూసి కేటీఆర్ విస్మయానికి గురయ్యారు. ఫ్రెంచ్ యూనివర్సిటీ “నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అండ్ సివిలైజేషన్స్”లో దక్షిణాసియా, హిమాలయన్ స్టడీస్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న నెగర్స్ తెలుగు భాషపై ఏళ్లుగా పరిశోధన చేస్తున్నారు. ఈ సందర్భంగా నైగర్స్ తన పరిశోధన వివరాలను కేటీఆర్కు వివరించారు. “వేల మైళ్ల దూరాన ఉండి కూడా మీరు తెలుగు భాషపై చూపిస్తున్న మమకారం నిజంగా స్ఫూర్తిదాయకం’ అని నైగర్స్ ను ప్రశంసిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

