మంగళవారం వెలువడిన స్థానిక ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీనేతలు కొందరికి ఘోర పరాభవం జరిగింది. కాంగ్రెస్ ముఖ్యనేతల సొంత ఊర్లలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ప్రత్యర్థి పార్టీలు కైవసం చేసుకున్నాయి. చాలా చోట్ల కాంగ్రెస్ నేతల సొంత గ్రామాల్లో కారు పాగా వేసింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి నేతలందరూ ఖుషీగా ఉన్న సమయంలో స్థానిక ఫలితాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి.
టీ పీసీసీ ఛీఫ్ పొన్నాల, మాజీ డిప్యూటీ ఛీఫ్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ, సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ, డీ శ్రీనివాస్, గీతారెడ్డి, శ్రీధర్ బాబు, మల్లు భట్టివిక్రమార్క, జగ్గారెడ్డి, మాజీ ఛీఫ్ విప్ లు ఆరెపల్లి మోహన్, గండ్ర వెంకటరమణారెడ్డిల సొంత గ్రామాల్లో ప్రత్యర్థి పార్టీలు సీట్లు కైవసం చేసుకోగా, మాజీ మంత్రులు షబ్బీర్అలీ, జానారెడ్డిలు మాత్రం తమ నియోజకవర్గంలో పట్టు సాధించారు.