ఈనెల 16న రాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో గెలుపు మాదేనని, పరిషత్ ఎన్నికల్లోనే తమను ఎదుర్కోలేకపోయారని, సాధారణ ఎన్నికల ఫలితాల్లో మా ప్రభంజనం మిగతా పార్టీలు తట్టుకోలేవని టీఆర్ఎస్ పార్టీ నేతలు హరీష్ రావు, కేటీఆర్ స్పష్టం చేశారు. పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంలో మంగళవారం మీడియాతో సమావేశమై హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ప్రజల్లో టీఆర్ఎస్ పై ఉన్న నమ్మకానికి పరిషత్ ఫలితాలే నిదర్శనమని, సార్వత్రిక ఎన్నికలముందు కేసీఆర్ సుడిగాలి పర్యటనల ద్వారా ప్రచారం చేసి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారని చెప్పారు. పరిషత్ ఎన్నికల కంటే అధికంగా ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ వెంట నడిచారని, మిగిలిన పార్టీలకు కనీసం డిపాజిట్లు కూడా దక్కవని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
హరీష్ రావు మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 75 స్థానాలకు పైగా వస్తాయని, 10 రోజులపాటు కేసీఆర్ చేసిన ప్రచారంతో తెలంగాణలోని ప్రతి పల్లె టీఆర్ఎస్ వైపు తిరిగిందని, పరిషత్ ఎన్నికల ఫలితాలు చూసినతర్వాత టీఆర్ఎస్ పార్టీ ఎవరి మద్దతు లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న విషయంలో ఎటువంటి సందేహం లేదని ఆన్నారు.