స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎం, ఇతర సిబ్బంది నియామకానికి త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో 800 మంది సీనియర్ రెసిడెంట్లను ఇటీవలే పూర్తిగా జిల్లాల్లోనే నియమించామని మంత్రి వెల్లడించారు. దుబ్బాకలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు తుదిదశలో ఉన్నదని, 15 రోజుల్లో ప్రారంభమవుతుందన్నారు. తెలంగాణ ఆవిర్భవానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలో 3 డయాలసిస్ సెంటర్లు ఉంటే, ఇప్పుడు 103కు చేరాయని చెప్పారు. రాష్ట్రంలో వెయ్యి మంది డాక్టర్ల నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకున్నదని, దసరా నాటికి ఉత్తర్వులు అందజేస్తామని చెప్పారు. అసెంబ్లీలో వైద్య సిబ్బంది పదవీ విరమణ వయసు పెంపు సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి హరీష్ రావు ఈ వివరాలు వెల్లడించారు.

