mt_logo

తెలంగాణకు మరో మణిహారం.. పట్టాలెక్కనున్న ముంబై-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్

దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన భాగ్యనగరానికి దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి శరవేగంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా, రెండు నగరాల మధ్య బుల్లెట్‌ రైలు ప్రారంభించేందుకు నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌) ప్రతిపాదించింది. నవంబర్‌ 5న ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ బిడ్‌ సమావేశం నిర్వహించనున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అచల్‌ ఖేర్‌ తెలిపారు. అదే నెల 18న టెండర్లు తెరిచే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను రూపొందించేందుకు ఇటీవలే టెండర్లు పిలిచారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌ నుంచి ముంబైకి రైలులో కేవలం మూడున్న గంటల్లో చేరుకోవచ్చు. దాంతో 9.5 గంటల సమయం ఆదా అవుతుంది. ప్రస్తుతం రెండు నగరాల మధ్య నడుస్తున్న అత్యంత వేగవంతమైన రైలు హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లినా 14 గంటల సమయం పడుతున్నది. ఈ ప్రాజెక్టును దాదాపు రూ.లక్ష కోట్ల వ్యయంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో నిర్మిస్తారు.

వయా వికారాబాద్‌ :

ముంబై-హైదరాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును ముందుగా తెలంగాణలోని జహీరాబాద్‌ను లింక్‌ చేస్తూ నిర్మించాలనుకున్నా.. ఆ తర్వాత దూరం, ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించేందుకు వికారాబాద్‌ మీదుగా నిర్మించేందుకు సర్వే చేస్తున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ముంబై-పుణె-జహీరాబాద్‌ మీదుగా హైదరాబాద్‌ వరకు 780 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తాజాగా ముంబై-పుణె-గుల్బర్గా-తాండూరు-వికారాబాద్‌ మీదుగా హైదరాబాద్‌కు అలైన్‌మెంట్‌ మార్చనుండటంతో 649.76 కిలోమీటర్లకు తగ్గుతుంది.

ఐదు మండలాలు..40 గ్రామాల్లో సర్వే :

ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ ఆధ్వర్యంలో బుల్లెట్‌ రైల్వే లైన్‌ సర్వే పనులు చేపట్టారు. వికారాబాద్‌ జిల్లా పరిధిలో ప్రభుత్వ పరంగా సహాయ, సహకారాలు అందించాలని ఈ సంస్థ ప్రతినిధులు ఇటీవల జిల్లా అధికారులను కోరారు. జిల్లా పరిధిలోని తాండూరు, పెద్దేముల్‌, ధరూర్‌, వికారాబాద్‌, నవాబ్‌పేట్‌ మండలాల్లోని 40 గ్రామాల్లో త్వరలోనే సోషల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ చేపట్టనున్నారు.

ప్రాజెక్టు కీలకాంశాలు :

ముంబైలో భారీ రైల్వే టెర్మినల్‌ నిర్మాణానికి స్థలం లేనందున నవీముంబైలో నిర్మించాలని ప్రతిపాదించారు. అక్కడి విమానాశ్రయ స్థలంలో భూగర్భంలో రైల్వే టెర్మినల్‌ నిర్మించాలని ఆలోచిస్తున్నామని ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ అధికారులు తెలిపారు. డీపీఆర్‌ సిద్ధమైన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటిలోపు పూర్తవుతుందనేదానిపై స్పష్టత రానున్నది. ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్‌ బుల్లెట్‌ రైలు వేగాన్ని తట్టుకోలేని కారణంగా..కొత్తగా ట్రాక్‌ నిర్మించనున్నారు. ప్రాజెక్టు లైన్‌ ఏర్పాటుకు సంబంధించి రూట్‌ మ్యాప్‌ పనులు ప్రారంభమయ్యాయి. తాండూరు, వికారాబాద్‌ ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే, గూగుల్‌ మ్యాపింగ్‌ పనులు చివరి దశకు చేరాయి. గూగుల్‌ మ్యాపింగ్‌ జరుగుతున్న ప్రాంతాల్లో ప్రతి 10 కిలోమీటర్లకు ఒక పిల్లర్‌ను నిర్మించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *