జనగామ జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం జనగామ జిల్లా కలెక్టరేట్ లో శనివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పంచాయితీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర పథకాల్లో మనం ముఖ్యంగా ఈజీఎస్ పథకాన్ని వాడుకుంటున్నాం. ఈ పథకంలో నిర్ణీత టార్గెట్లు పూర్తి చేసుకున్నామని చెప్పారు. మరిన్ని నిధుల కోసం ఇప్పటికే కేంద్రాన్ని కోరామని, ఇలాంటి పరిస్థితి అన్ని కేంద్ర పథకాల్లో కూడా ఉండాలన్నారు. కేంద్ర నిధులు మరిన్ని రాబట్టడం ద్వారా జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీలు, కలెక్టర్, ఇతర అధికారులకు మంత్రి సూచించారు..
రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు, పథకాలకు తోడు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా తోడైతే మరింత అభివృద్ధి సాధించడానికి వీలవుతుందని ఎర్రబెల్లి అన్నారు. కేంద్రం నుండి నిధులు రాబట్టడానికి జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ(దిశ)కి ఛైర్మన్ గా ఉన్న ఈ జిల్లా ఎంపీ, కో ఛైర్మన్ గా ఉన్న రాజ్యసభ సభ్యులు, సభ్య కార్యదర్శిగా ఉన్న కలెక్టర్ సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీలు పసునూరి దయాకర్, బండ ప్రకాష్, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జెడ్పీ ఛైర్మన్ సంపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.