Mission Telangana

మూడు గ్రామాలను దత్తత తీసుకున్న ఎమ్మెల్సీ పల్లా..

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి పథకంలో భాగంగా మూడు గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రకటించారు. వరంగల్ జిల్లా ధర్మసాగరం మండలంలోని సోదేశ్ పల్లి, గుండ్ల సాగర్, మల్లికుదుర్ల గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు ఆయన ఆదివారం మీడియాకు తెలిపారు. గ్రామజ్యోతి పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు ఈ మూడు గ్రామాలలో మూడు రోజులుగా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ పెద్దల సహకారంతో గ్రామసభలు నిర్వహించానని చెప్పారు.

రానున్న రెండు నెలల్లో ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఏర్పాటు, మంచినీటి సమస్య, వందశాతం పారిశుద్ధ్యంపై చర్చించామని, గ్రామాల అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై దిశా నిర్దేశం చేశామన్నారు. మూడు రోజులుగా సన్నాహక సమావేశాలతో పాటు శ్రమదానం నిర్వహించి, రోడ్లకు ఇరువైపులా ఉన్న ముళ్ళ చెట్లను తొలగించామని పల్లా తెలిపారు. ఇప్పటికే మల్లికుదుర్ల గ్రామంలో గుడుంబా నిషేధం అమలవుతుండగా, మిగిలిన రెండు గ్రామాల్లోనూ నిషేధాన్ని అమలు చేస్తామని గ్రామస్తులు శపథం చేశారని చెప్పారు. మల్లికుదుర్లలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అంగన్ వాడీ భవనాలు, మహిళాశక్తి, పాఠశాలల్లో విద్యార్థులకు పెన్సిళ్ళు, డ్యూయల్ డెస్క్ లు, మరుగుదొడ్ల నిర్మాణం తదితర సౌకర్యాలకు తన నిధులను కేటాయిస్తానని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *