mt_logo

తెలంగాణకు వెంటనే ఎరువులు సరఫరా చేయాలి : కేంద్రానికి లేఖ రాసిన మంత్రి నిరంజన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వెంటనే ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మాన్ సుఖ్ మాండవీయకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం లేఖ రాశారు. యాసంగిలో 20.5 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులను కేంద్రం కేటాయించగా.. తెలంగాణ రాష్ట్ర అవసరాల మేరకు నెల వారీగా కావాల్సిన ఎరువుల కోసం సెప్టెంబరులోనే కేంద్రానికి లేఖ ద్వారా విన్నవించామని మంత్రి తెలిపారు. అక్టోబర్‌, నవంబర్‌ మాసాలకు గాను 6.4 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులకు గాను కేవలం 3.67 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేంద్రం కేటాయించగా.. ఆ కేటాయించిన కోటాలో కూడా ఇప్పటి వరకు 1.55 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే కేంద్రం సరఫరా చేసిందన్నారు. కేంద్ర కేటాయింపుల ప్రకారమే 2.12 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇంకా రావాల్సి ఉందన్నారు. కావున ఏపీలోని గంగవరం పోర్టులోని ఐపీఎల్ కంపెనీ వెసెల్ నుంచి 23 వేల మెట్రిక్ టన్నుల యూరియా, కాకినాడ మరియు విశాఖ పోర్టులలో ఉన్న ఆర్సీఎఫ్, చంబల్, ఐపీఎల్ ఫర్టిలైజర్స్ కు చెందిన వెసెల్స్ నుంచి 30 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ కేటాయించాలని మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అలాగే క్రిబ్ కో కంపెనీ నుంచి రెండు అదనపు రేక్ ల యూరియా కేటాయించాలన్నారు. అక్టోబర్, నవంబర్ నెలలలో తక్కువగా సరఫరా చేసిన ఎరువులను డిసెంబర్ నుంచి మార్చి సరఫరాలో భర్తీ చేయాలని లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *