యువత తమదైన లక్ష్యాలను నిర్ధేశించుకుని ముందుకు సాగాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా నందిగామలోని కన్హా శాంతివనంలో జరుగుతున్న అంతర్జాతీయ యువజన సదస్సులో మంత్రి కేటీఆర్ వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మానవాభివృద్ధి కోసం పాటుపడుతున్న వ్యక్తులు, సంస్థలతో కలిసి పనిచేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలన్నారు. దీనికోసం ప్రభుత్వం కార్యక్రమాలను రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందులో ప్రభుత్వ పాత్ర పరిమితంగానే ఉండొచ్చు, కానీ ప్రోత్సహించడానికి తాము కృషిచేస్తామన్నారు. యువత విద్యార్థి దశలోనే సమాజం పట్ల అవగాహన పెంచేందుకు పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకొస్తామని వెల్లడించారు. వాళ్లలో అభిరుచి, దయాగుణం, విలువలు నేర్పించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. యువతలో సమాజం పట్ల అవగాహన, నైతిక విలువలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వారిని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

