mt_logo

మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు అప్‌డేట్ కావాలి : మంత్రి కేటీఆర్

ప్ర‌తి విద్యార్థి, టీచ‌ర్.. స్కిల్, అప్ స్కిల్, రీ స్కిల్ అనే మంత్రాన్ని మ‌రిచిపోకూడద‌ని రాష్ట్ర ఐటీ, పరిశ్ర‌మ‌ల శాఖ‌ల మంత్రి కేటీఆర్ సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అప్‌డేట్ కావాలి. అప్ స్కిల్, రీస్కిల్ చేసుకోక‌పోతే వెనుక‌బ‌డిపోతామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. గోల్కొండ ప‌రిధిలోని తారామతి భార‌ద‌రి రిసార్ట్‌లో తెలంగాణ స్కూల్ ఇన్నోవేష‌న్ ఛాలెంజ్ 2021-22 కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి హాజ‌ర‌య్యారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థులు రూపొందించిన వివిధ ఆవిష్క‌ర‌ణ‌ల‌ను మంత్రులు ప‌రిశీలించారు. విద్యార్థుల ఆవిష్క‌ర‌ణ‌ల‌ను ఆస‌క్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… క‌రోనా త‌ర్వాత చాలా పెద్ద ఎత్తున విద్యాశాఖ నేతృత్వంలో, ఐటీ శాఖ స‌హ‌కారంతో చేసిన ఈ కార్య‌క్ర‌మంలో ప‌లు పాఠ‌శాల‌ల విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ స్కూల్ ఇన్నోవేష‌న్ ఛాలెంజ్‌లో పాల్గొనేందుకు 5,387 స్కూల్స్ రిజిస్ట‌రేష‌న్ చేసుకున్నాయి. 7,003 టీచ‌ర్లు విద్యార్థుల‌కు శిక్ష‌ణ ఇచ్చారు. 25,166 విద్యార్థులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 11,037 టీమ్స్ త‌మ ఆవిష్క‌ర‌ణ‌ల‌ను పంచుకున్నాయి. 79 టీమ్స్ షార్ట్ లిస్ట్ లో చేరాయి. 20 టీమ్స్ గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నాయి. జ్యూరీ ద్వారా ఎంపిక కాబ‌డ్డ ఐదు టీమ్స్‌కు బ‌హుమ‌తులు ప్ర‌దానం చేసిన‌ట్లు కేటీఆర్ తెలిపారు. చిన్న‌ పిల్ల‌ల్లో సృజ‌నాత్మ‌క‌త అధికంగా ఉంటుంది. చాలా ప్ర‌యోగాలు చేస్తుంటారు. వేస‌వి సెల‌వుల్లో మా అమ్మ‌మ్మ ఊరికి వెళ్లిన‌ప్పుడు.. చిన్న చిన్న ప్ర‌యోగాలు చేసేవాళ్లం. చిన్న చిన్న బ‌ల్బుల్లో ఫిల‌మెంట్ తీసేసి, నీళ్లు పోసి, ర‌క‌ర‌కాల క‌ల‌ర్లు వేసి రిఫ్లెక్టింగ్ చేసేవాళ్లం. ఆ మాదిరిగానే చాలా మంది చిన్న పిల్ల‌లు ప్ర‌యోగాలు చేసి, అందులో కొత్త అంశాన్ని తెలుసుకోవాలనే ఉత్సాహం, ఉత్సుక‌త‌తో ముందుకు వెళ్తుంటార‌ని కేటీఆర్ తెలిపారు.

ఇన్నోవేష‌న్‌కు పెద్ద‌పీట :
ఇన్నోవేష‌న్‌కు పెద్ద‌పీట వేస్తున్నాం. రూర‌ల్, సోష‌ల్ ఇన్నోవేట‌ర్లు ముందుకు రావాలి. టెక్నాల‌జీకి సంబంధించి టీ హ‌బ్ ఏర్పాటు చేశాం. హార్డ్ వేర్‌కు సంబంధించి టీ వ‌ర్క్స్ ఏర్పాటు చేసుకున్నాం. మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల కోసం వీహ‌బ్ అందుబాటులోకి తెచ్చాం. ఇన్నోవేష‌న్ ల్యాబ్‌ల‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఇండ‌స్ట్రీని, సైంటిఫిక్ ల్యాబ్‌ల‌ను ఒకే వేదిక‌పైకి తీసుకొచ్చేందుకు రిచ్ అనే సంస్థ‌ను ఏర్పాటు చేశామ‌ని కేటీఆర్ గుర్తు చేశారు.

కొత్త‌గా యూత్ హ‌బ్ :
కొత్త‌గా యూత్ హ‌బ్ ను ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఈ యూత్ హ‌బ్‌ను రూ. 6 కోట్ల ఫండ్‌తో ఏర్పాటు చేయ‌బోతున్నామ‌ని తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు రోల్ మోడ‌ల్‌గా నిలుస్తున్నాయి. టీచ‌ర్ ఇన్నోవేష‌న్ పోర్ట‌ల్‌ను ప్రారంభించుకున్నాం. మ‌న ఊరు – మ‌న బ‌డి కార్య‌క్ర‌మం కింద 12 ర‌కాల అంశాల‌ను ప్ర‌వేశ‌పెట్టాం. అద‌న‌పు త‌ర‌గ‌తి గ‌దులు, ఫ‌ర్నీచ‌ర్, డిజిట‌ల్ క్లాస్ రూమ్‌లు, హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ క‌నెక్ష‌న్ ఇవ్వ‌బోతున్నాం. క‌రోనా స‌మ‌యంలో త‌లెత్తిన‌ ఇబ్బందులు భ‌విష్య‌త్‌లో రాకుండా అత్యుత్త‌మ బోధ‌న అందించేందుకు డిజిట‌ల్ క్లాసులు ఏర్పాటు చేస్తున్నాం. మ‌న ఊరు మ‌న బ‌డి దేశానికే ఆద‌ర్శంగా నిల‌వ‌బోతుంద‌న్నారు. కొత్త పోక‌డ‌లు పోతున్న విద్యా వ్య‌వ‌స్థ ప‌ట్ల టీచ‌ర్ల‌కు కూడా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని కేటీఆర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *