రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో ఎలాంటి పైరవీలు ఉండవని, ఎవరైనా డబ్బులు తీసుకుని ఇండ్లు ఇస్తామని చెప్తే నమ్మొద్దని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సనత్నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్పేట డివిజన్ చాచా నెహ్రూనగర్లో నూతనంగా నిర్మించిన 248 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని పేదలందరికి ఇండ్లు అందించే ప్రయత్నం చేస్తామన్నారు. డబ్బులకు ఇళ్ళు ఇప్పిస్తామంటే నమ్మొద్దని, కేవలం లాటరీ పద్ధతిలో మాత్రమే ఇండ్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. నిరుపేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని, ఇందుకోసం 18 వేల కోట్లతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రారంభించామని వెల్లడించారు. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడని పెద్దలు అంటారు.. అయితే ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లీ నేనే చేస్తానన్న ఏకైక సీఎం కేసీఆరే అని చెప్పారు. మార్కెట్లో 40 లక్షల విలువచేసే ఇంటిని ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత పింఛన్ 10 రెట్లు పెంచామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 200 గా ఉన్న పెన్షన్ను 2 వేలు చేశామన్నారు. తెలంగాణ వచ్చాక విద్యుత్, తాగునీటి సమస్యలను పరిష్కరించామని తెలిపారు.