పేదరికం వైద్య విద్యను చదువుకోలేకపోతున్నామని ఆందోళనలో ఉన్న ఇద్దరు బాలికలకు మంత్రి కె. తారకరామారావు అండగా నిలిచారు. వారికి ఆర్థిక సహాయం అందించి ఎంబీబీఎస్ చదువాలనుకున్న వారి కలను సాకారం చేశారు. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన ఆవునూరి అఖిల ఇంటర్మీడియట్లో 98 శాతం మార్కులతో మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్లో సీటు సాధించింది. కానీ అఖిల తండ్రి ప్రభాకర్ ఒక రైతు కావడంతో ఫీజులు ఎలా చెల్లించాలో వారికి అర్థం కాలేదు. అలాగే దినసరి కూలీ కుటుంబానికి భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన స్పందన 95 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకుని టీఆర్ఆర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. వీరివురి పరిస్థితి తెలుసుకున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వారి ఫీజుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు. సోమవారం అఖిలను, స్పందనను ప్రగతి భవన్ కు పిలిచి అభినందించిన మంత్రి కేటీఆర్… వారికి అన్ని విధాల అండగా ఉంటామని, బాగా చదువుకొని ఉన్నతస్థితికి రావాలని సూచించారు. మంత్రి కేటీఆర్ చేయూతతో తమ ఎంబీబీఎస్ ఆశ కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకుని సమాజానికి తమ వంతు సేవ చేస్తామని అన్నారు.