తెలంగాణ బీజేపీ నేతలు గుజరాతీ బాస్ల చెప్పులను మోసేందుకు సిద్ధంగా ఉంటారని, తెలంగాణకు రావాల్సిన న్యాయమైన హక్కుల గురించి అడిగే దమ్ము, దైర్యం వారిలో ఎవ్వరికీ లేవని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రొఫెసర్ కే నాగేశ్వర్ చేసిన ట్వీట్ను మంత్రి కేటీఆర్ ట్యాగ్ చేస్తూ… బీజేపీ నేతల తీరును తీవ్రంగా ఖండించారు. న్యాయమైన హక్కుల గురించి డిమాండ్ చేసే బీజేపీ నేతలు తెలంగాణలో ఒక్కరు కూడా లేరని ఆయన ఆరోపించారు.
ఆస్కార్ రేసులో గుజరాతీ సినిమా చేతిలో ఆర్ఆర్ఆర్ ఓడిపోయిందని, కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని, కానీ గుజరాత్కు లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఇచ్చారని, హైదరాబాద్కు రావాల్సిన డబ్ల్యూహెచ్వో సెంటర్ను గుజరాత్లోని జామ్నగర్కు తరలించారని, హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్కు పోటీగా గుజరాత్లో సెంటర్ను ఓపెన్ చేశారని ప్రొఫెసర్ నాగేశ్వర్ తన ట్వీట్లో ఆరోపించారు. ట్వీట్ను ట్యాగ్ చేసిన మంత్రి కేటీఆర్… బీజేపీ నేతలు గుజరాతీ బాస్ల చెప్పులను మోసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని, కానీ తెలంగాణకు అందాల్సిన హక్కుల గురించి డిమాండ్ చేసే ధైర్యం ఎవరికీ లేదని కేటీఆర్ అన్నారు. మోడీవర్స్కు గుజరాత్ కేంద్ర బిందువుగా మారిందని కేటీఆర్ తన ట్వీట్లో విమర్శించారు.