తెలంగాణ రైతులు వ్యవసాయంలో సరికొత్త రికార్డు సృష్టించడం పట్ల రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ రైతులకి శుభాకాంక్షలు తెలుపారు. దేశంలో ఏ రాష్ట్ర రైతులు సాధించని ఘనత తెలంగాణ రైతులు సాధించారని ఆనందం వ్యక్తం చేస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.
సీఎం కేసీఆర్ తెచ్చిన విప్లవాత్మక నిర్ణయాల కారణంగా తెలంగాణలో వ్యవసాయం పండుగలా మారిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరువు పీడిత నేలగా ఉన్న తెలంగాణ నేడు స్వరాష్ట్రంలో కోటి 35లక్షల ఎకరాల మాగాణి అయిందన్నారు. నాడు సాగునీరు లేక నెర్రలు బారిన ఈ నేల నేడు పచ్చని పైరులతో కళకళలాడుతూ నూతన రికార్డులు సృష్టిస్తోందన్నారు. రైతుబంధు, 24/7 కరెంట్, సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, ఫలాలతో తెలంగాణలో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతుందని భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఒకప్పటి తెలంగాణ రైతుల గోస చూసిన ఏ తెలంగాణ పౌరుడైనా.. నేటి మన రైతన్న ఉచ్చ స్థితిని చూసి గర్వపడాల్సిందే కేటీఆర్ పేర్కొన్నారు.