mt_logo

హిందీలోనే మాట్లాడాలి అనడం భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీస్తుంది : మంత్రి కేటీఆర్

ఇంగ్లీష్ కు బదులు హిందీలోనే మాట్లాడాలి అన్న కేంద్ర హోం శాఖ మంత్రిపై మండిపడ్డారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. వివిధ రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌జ‌లు మాట్లాడుకునేట‌ప్పుడు ఇంగ్లీష్, స్థానిక భాష‌ల్లోనే కాకుండా, త‌ప్ప‌కుండా హిందీలోనే మాట్లాడాల‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌ను కేటీఆర్ తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. అమిత్ షా వ్యాఖ్య‌ల‌పై మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదిక‌గా ఘాటుగా స్పందించారు. భార‌త‌దేశం ఒక వ‌సుదైక కుటుంబమ‌ని పేర్కొన్న కేటీఆర్.. భిన్న‌త్వంలో ఏక‌త్వ‌మే మ‌న బ‌లం అని పేర్కొన్నారు. మ‌న దేశంలోని ప్ర‌జ‌లు ఏం తినాలో, ఏం ధ‌రించాలో, ఎవ‌రిని ప్రార్థించాలో, ఏ భాషా మాట్లాడాలో ప్ర‌జ‌ల నిర్ణ‌యానికే వ‌దిలేయాలన్నారు. దేశంలో ఏ భాష మాట్లాడాలో దేశ ప్రజలను ఎందుకు నిర్ణయించుకోనివ‍్వకూడదంటూ ప్రశ్నించారు. భాషా దురాభిమానం, ఆధిపత్యం చెలాయించడం వంటివి బూమరాంగ్‌ అవుతాయ‌ని ఘాటుగా స్పందించారు. నేను మొద‌ట భార‌తీయుడిని.. ఆ త‌ర్వాతే గ‌ర్విచంద‌గ్గ‌ తెలుగువాడిని, తెలంగాణ‌వాడిని అని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. తన మాతృభాష తెలుగులో మాట్లాడ‌గ‌ల‌నని, అయిన‌ప్ప‌టికీ ఇంగ్లీష్, హిందీతో పాటు కొంచెం ఉర్దూలో కూడా మాట్లాడ‌గ‌ల‌న‌ని కేటీఆర్ తెలిపారు. దేశంలో హిందీని మాత్రమే మాట్లాడాలి అనడం, ఇంగ్లీష్‌ భాషను నిషేధించడం వంటి ప్ర‌తిపాద‌న‌లు యువతకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయ‌ని అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *