mt_logo

మెడికల్ టూరిజం అడ్డాగా హైదరాబాద్ : మంత్రి హరీష్ రావు

మంచి నాణ్యతా ప్రమాణాలతో కూడిన చికిత్స కోసం వివిధ దేశాలు, నగరాల నుండి ఎంతోమంది హైదరాబాద్ కు వస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో హ్యూగో రోబోటిక్స్ అసిస్టెడ్ సిస్టం మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… తెలంగాణ వచ్చాక ప్రతీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నామని, ప్రతీ ఏడాది 233 పీజీ సీట్లను యాడ్ చేస్తున్నట్లు తెలిపారు. గతంలో యూజీ సీట్లు 800 సీట్లు ఉంటే వాటిని 2840 కు పెంచామని చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల అడ్మనిస్ట్రేషన్ బలోపేతం చేస్తున్నామని…ఆరోగ్య రంగం అభివృద్ధికి ప్రభుత్వం రూ.11,440 కోట్లు బడ్జెట్లో కేటాయించిందని గుర్తు చేశారు.

ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం మూడు టిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఐటీలో హైదరాబాద్ మేటిగా ఉందని….వైద్యంలోనూ మేటిగా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు..ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ సాధారణ డెలివరీలు పెరగాలని…సర్జరీలు తగ్గాలని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో అవసరం ఉన్న పరీక్షలు మాత్రమే చేయాలన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల మీద కొన్ని సందర్భాల్లో నెగిటివ్ ఉంటుందని…ఆ నెగిటివ్ పోవాలన్నారు. కేర్ ఆసుపత్రిలో ఆరోగ్య శ్రీ కేసులు తీసుకోవాలని మంత్రి హరీష్ రావు కోరారు.

కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవడం ఎంతో అవసరమని మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు. తద్వారా రికవరీ పెరుగుతుందని చెప్పారు. పేషెంట్ ఆసుపత్రిలో ఉండే సమయం తగ్గితే.. వారికి బిల్ తగ్గుతుందన్నారు. బెస్ట్ ట్రీట్మెంట్ తో పాటు, అఫర్డబుల్ ట్రీట్మెంట్ అందించాలని ప్రైవేట్ ఆసుపత్రులకు సూచించారు. చికిత్స కోసం ఎంతోమంది నగరానికి వస్తున్నారని…హైదరాబాద్లో మెడికల్ టూరిజం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. సీఎం కేసీఆర్ కల్పిస్తున్న అవకాశాల వల్ల ఇక్కడ పెట్టుబడులు పెరుగుతున్నాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *