mt_logo

హైదరాబాద్ లో మే 9 నుండి మన బస్తీ-మన బడి పనులు : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఈ నెల 9 వ తేదీన మన బస్తీ – మన బడి పనులను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి హైదరాబాద్ జిల్లా పరిధిలో మన బస్తీ – మన బడి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు సమగ్రమైన అభివృద్ధి, మౌలిక సదుపాయాలను కల్పించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం మన ఊరు –మనబడి, మన బస్తీ – మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఇందుకోసం 11 మంది మంత్రులతో సబ్ కమిటీ ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 26,065 పాఠశాలలను ప్రభుత్వం గుర్తించి 7,289.54 కోట్ల రూపాయలను కేటాయించిందని చెప్పారు. హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో 690 పాఠశాలలు ఉండగా, మొదటి విడతలో 239 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని, వీటికి ఎస్టిమేషన్ లను కూడా సిద్దం చేసినందున ఈ నెల 9 వ తేదీన జిల్లాలోని అన్ని నియోజకవర్గాల MLA లు వారి నియోజకవర్గాలలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పనులను ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రధానంగా ఆయా పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం, త్రాగునీటి సౌకర్యం, విద్యార్ధులు, ఉపాధ్యాయులకు సరిపడా ఫర్నిచర్ ఏర్పాటు చేయుట, పాఠశాల భవనాలకు కలర్స్ వేయడం, అవసరమైన మరమ్మతులు చేపట్టడం, గ్రీన్ చాక్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం, కాంపౌండ్ వాల్స్ నిర్మించడం వంటి మౌలిక వసతులను కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు.

రానున్న రోజులలో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారనున్నాయని తెలిపారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తామనే విధంగా అభివృద్ధి తీర్చిదిద్దనున్నట్లు ఆయన చెప్పారు. గతంలో మాదిరిగా కాకుండా విద్యార్ధుల కొలతలకు అనుగుణంగా యూనిఫాం కుట్టించి అందజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు విద్యారంగ అభివృద్ధి, పాఠశాలల్లోని సమస్యల పరిష్కారం పట్ల ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో వెయ్యి వరకు గురుకుల పాఠశాలలను ప్రారంభించినట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం (జూన్ 2022) నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తరగతులను ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. మన బస్తీ – మన బడి పనులను పర్యవేక్షించాల్సిన బాద్యత డిప్యూటీ DEO లపై ఉంటుందని, ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా MLA ల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, వసతులను కల్పించడం పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. వికలాంగ విద్యార్ధులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పాఠశాలల వారిగా సిబ్బంది, ఉపాద్యాయుల ఖాళీలకు సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించి అందజేయాలని అధికారులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. అధికారులు అందజేసే నివేదికను మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని రెడ్ క్రాస్ సొసైటీ స్కూల్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని MLA జాఫర్ హుస్సేన్ సమావేశం దృష్టికి తీసుకు రాగా, త్వరలో స్కూల్ ను సందర్శించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు అవసరమైన క్రీడా సామాగ్రిని ప్రభుత్వం అందించనున్నదని తెలిపారు. పాఠశాలల్లో సరైన క్రీడా మైదానం లేని చోట్ల GHMC కి చెందిన స్థలాలను గుర్తించి విద్యార్ధులకు అవసరమైన సౌకర్యాలను కల్పించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం విద్య, వైద్యం పై ప్రత్యేక దృష్టి సారించిందని, అందులో భాగంగానే విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ తో ముందుకు వెళుతుందని వివరించారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, MLC లు MS.ప్రభాకర్, స్టీఫెన్ సన్, సురభి వాణిదేవి, MLA లు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, జిల్లా కలెక్టర్ శర్మన్, విద్యాశాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *