డిస్ట్రిక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులు రైతులకే కాకుండా దేశ, విదేశీ ఉన్నత చదువుల కోసం విద్యార్థులకు కూడా రుణాలు అందజేస్తుందని వ్యవసాయ,సహకార శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్లోని తన నివాసంలో డిస్ట్రిక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ (డీసీసీబీ) ద్వారా విదేశీ విద్య కోసం రుణం అందుకున్న తొలి విద్యార్థి కరకాల హేమంత్ రెడ్డిని సన్మానించి రూ.23 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..ఉన్నత విద్య పేదలకు అందని ద్రాక్ష కాకూడన్నదే సీఎం కేసీఆర్ తపన అన్నారు. పేద విద్యార్థులకు విదేశీ విద్య కోసం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కింద రూ.20 లక్షల సాయం ప్రభుత్వం అందజేస్తున్నది. ఇప్పుడు డీసీసీబీ కూడా ముందుకు రావడం అభినందనీయమన్నారు. గతంలో ఆర్థిక చేయూత లేక ఉన్నత చదువులకు, విదేశీ విద్యకు దూరమైన విద్యార్థులు డీసీసీబీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా తదితరులు ఉన్నారు.

