mt_logo

కేసీఆర్ పాలన సాక్షిగా ఇది తెలంగాణ దశాబ్ది.. వెయ్యేళ్ళయినా చెక్కుచెదరని పునాది: కేటీఆర్

జూన్ 2, 2024 నాటికి తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవ్వనున్న సందర్భంగా.. గత పదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని గుర్తుచేసుకుంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఅర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఇది తెలంగాణ దశాబ్ది.. ఆరున్నర దశాబ్దాల పోరాటం..
మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు.. వేల బలిదానాలు, త్యాగాలు..
బిగిసిన సబ్బండ వర్గాల పిడికిళ్లు.. ఉద్యమ సేనాని అకుంఠిత, ఆమరణ దీక్ష.. ఉద్యమం విజయతీరాలకు చేరి స్వరాష్ట్రం సాక్షాత్కారం అయ్యింది అని పేర్కొన్నారు.

ఉద్యమ నాయకుడే ప్రజాపాలకుడిగా.. స్వతంత్ర భారతదేశం ముందెన్నడూ చూడని.. సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి నమూనా ఆవిష్కారం అయ్యింది. పల్లె, పట్నం తేడా లేకుండా ప్రగతి రథం పరుగులు తీసింది, ఆహార ధాన్యాల ఉత్పత్తి నుండి ఐటి ఎగుమతుల దాకా రికార్డులు బద్దలయ్యినయి అని అన్నారు.

మీ అందరి మద్దతుతో నీళ్ళిచ్చి కన్నీళ్లు తుడిచినం, నిరంతర కరెంటిచ్చి వెలుగులు నింపినం, రైతన్నల, నేతన్నల, కష్టజీవుల
కలత తీర్చినం.. కడుపు నింపినం. వృద్ధులకు ఆసరా అయినం..
ఆడబిడ్డలకు అండగా నిలిచినం. సకల జనుల సంక్షేమానికి తెలంగాణను చిరునామా చేసినం అని అభివర్ణించారు.

గుండెల నిండా జై తెలంగాణ నినాదం నింపుకున్నం. మన భాషకు పట్టం గట్టినం.. మన బతుకమ్మ, మన బోనం సగర్వంగా తలకెత్తుకున్నం. గంగా జమునా తెహజీబ్‌కు సాక్షీభూతంగా నిలిచినం. అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్న గడ్డ మీదనే తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని అంబరమంత ఎత్తున ఎగరేసినం అని కేటీఆర్ అన్నారు.

కేసీఆర్ పాలన సాక్షిగా ఇది తెలంగాణ దశాబ్ది.. వెయ్యేళ్ళయినా చెక్కుచెదరని పునాది అని తెలిపారు.