mt_logo

ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై స్పందించిన కేటీఆర్

ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పదేళ్ల బీజేపీ పాలనలో రాజకీయ ప్రత్యర్థులపైన కక్ష సాధింపు చర్యల కోసం అధికార దుర్వినియోగం, రాజ్యాంగ వ్యవస్థల దురుపయోగం చేయడం సర్వసాధారణంగా మారింది అని అన్నారు.

ఈరోజు ఈడీ ప్రదర్శించిన తొందరపాటు దుందుడుకు చర్యలపై సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కవిత అరెస్టు విషయం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఈడీ వ్యవహరించిన తీరుపైన రేపు సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పాల్సి వస్తుంది అని పేర్కొన్నారు.

ఖచ్చితంగా 19వ తేదీన జరిగే సుప్రీంకోర్టు విచారణలో ఈ అంశం పరిగణలోకి వస్తుందని ఆశిస్తున్నా.. ఈడీ స్వయంగా సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని (అండర్ టేకింగ్) తుంగలో తొక్కి ఈరోజు అరెస్టు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది అని కేటీఆర్ తెలిపారు.

ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది.. చట్టబద్ధంగా ఈ అంశంలో పోరాటం కొనసాగిస్తాం అని స్పష్టం చేశారు.