mt_logo

రేవంత్ సీఎం అయింది పేదవాళ్ల ఇళ్లు కూలగొట్టడానికా?: కేటీఆర్

ఇటీవలే తన సతీమణిని కోల్పోయిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పరామర్శించిన అనంతరం జడ్చర్లలో మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు.

కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు మహబూబ్‌నగర్ పట్టణంలో 4,000 డబుల్ బెడ్ రూమ్‌లు ఇచ్చాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పట్టాలనే ఆక్రమణలుగా చిత్రీకరించారు అని అన్నారు.

పేదవాళ్లు, దివ్యాంగులు అనే సోయి లేకుండా దయ, దాక్షిణ్యం లేకుండా 75 మంది ఇళ్లు కూలగొట్టారు. పాలమూరు బిడ్డనని రేవంత్ రెడ్డి చెప్పుకుంటాడు. ఎందుకు నువ్వు ముఖ్యమంత్రి అయ్యింది? పేదవాళ్ల ఇళ్లు కూలగొట్టటానికేనా? ఏ కారణంతో వాళ్ల ఇళ్లు కూలగొట్టారో ఈ ప్రభుత్వం సమాధానం చెబుతుందా? అని అడిగారు.

పేదవాళ్లు, బీదలు ఎక్కడైనా తెల్వక ఇళ్లు కట్టుకుంటే వారికే రెగ్యులరైజ్  చేసే విధంగా జీవో 58, 59 తెచ్చాం. ఇది సంస్కారవంతమైన ప్రభుత్వం చేయాల్సిన పని. కానీ మీ ప్రభుత్వం బడికి పోయే పిల్లలను, దివ్యాంగులను రోడ్డు మీద పడేసింది అని దుయ్యబట్టారు.

పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి.. నీకు సంస్కారం ఉంటే పేదల పట్ల ప్రేమ ఉంటే.. ఆ 75 మందికి డబుల్ బెడ్ రూమ్‌లు కేటాయించు. ఏ అధికారులైతే అక్రమంగా పేదల ఇళ్లు కూల్చారో ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి అని అన్నారు.

పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకు కేసీఆర్ గారు నీళ్లు ఇచ్చారు.. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో భాగంగా అన్ని రిజర్వాయర్లు పూర్తి చేశాం  95% పని అయిపోయింది. మిగిలిన 5% పనిని భూసేకరణ చేసి పూర్తి చేయాలి అని తెలిపారు.

దానికి సంబంధించిన టెండర్లు కూడా ప్రకటిస్తే ఈ ప్రభుత్వం రద్దు చేసింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను ఎందుకు పూర్తి చేస్తలేవు. కేసీఆర్‌కు పేరు వస్తదనే కారణంతోనే ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తలేవా? అని ప్రశ్నించారు.

సుంకిశాలలో ప్రమాదం జరిగింది.. ఆ ప్రమాదానికి కారణమైన మేఘా సంస్థను బ్లాక్‌లిస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.మేము గతంలోనే చెప్పాం.. కొడంగల్ లిప్ట్ ఇరిగేషన్ పనులను కూడా మేఘా సంస్థకే ఇస్తారని చెప్పాం. అదే విధంగా కొడంగల్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దాదాపు రూ. 4,350 కోట్ల పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థకే ఇచ్చారు. ప్రమాదానికి కారణమైన సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాల్సినప్పటికీ ఆ సంస్థకే పనులు అప్పగించాడు అని కేటీఆర్ అన్నారు.

దొంగలు, దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు సగం పనులు మేఘా ఇంజనీరింగ్‌కు మరో సగం పనులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ సంస్థకు కేక్‌ను కోసినట్లు వాళ్లకు అప్పగించావ్. ఇన్ని రోజులు చిల్లర మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు చెంపలేసుకొని క్షమాపణ చెప్పు అని అన్నారు.

ఏ కంపెనీని ఈస్ట్ ఇండియా అని అన్నావో.. అదే మేఘా కంపెనీకి పనులు అప్పగిస్తుంటే నీ నైజం, నీ రంగు, నీ నిజాయితీ ఏంటో ప్రజలకు తెలిసిపోతోంది. ఇన్ని రోజులు ఏ సంస్థపై విమర్శలు చేశావో.. ఏ ఆంధ్రా కాంట్రాక్టర్లు అన్నావో అదే సంస్థకు మళ్లీ పనులు అప్పగిస్తున్నావ్. బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాల్సిన మేఘా సంస్థకు ఏం ఆశించి ఈ పనులు ఇచ్చినవ్ అని మండిపడ్డారు.

ఒకవైపు కొండగల్‌కు రూ. 4,000 కోట్లకు పైగా కేటాయిస్తూ.. పాలమూరులో 10% పనులకు పైసలిస్తలేవు. పాలమూరులో కొంత డబ్బు ఖర్చు పెట్టి పనులు పూర్తి చేస్తే పాలమూరు అంత సస్యశ్యామలం అవుతుంది. ఎందుకిస్తలేవు.. మనసొస్తలేదా? లేదంటే కేసీఆర్ గారికి పేరు వస్తుందనేనా? అని అడిగారు.

పాలమూరు బిడ్డలకు చేతులేత్తి నమస్తారిస్తున్నాను. ఎంతో మంది భూములు ఇచ్చి సహకరించటంతోనే ఆ పనులు పూర్తి చేయగలిగాం. మేడిగడ్డకు ఏ విధంగా పార్టీ నాయకులంతా వెళ్లామో..పాలమూరు ప్రాజెక్ట్ సందర్శనకు కూడా అలాగే వెళ్తాం. దీనికి సంబంధించి త్వరలోనే కేసీఆర్ గారి పర్మిషన్ తీసుకొని రెండు రోజుల పర్యటన పెట్టుకుంటాం అని తెలిపారు.

పాలమూరులో కేసీఆర్ గారు కట్టించిన రిజార్వాయర్లు, పంప్ హౌస్‌లను ప్రజలకు వివరిస్తాం  ఈ ముఖ్యమంత్రి కొడంగల్ ప్రాజెక్ట్‌కు పైసలు ఖర్చు చేస్తూ.. పాలమూరును ఎలా ఎండబెడుతున్నాడో కూడా ప్రజలకు తెలిసేలా చేస్తాం అని కేటీఆర్ పేర్కొన్నారు.