mt_logo

బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్యకు బాధ్యత మంత్రి జూపల్లిదే: కేటీఆర్

కొల్లాపూర్‌లో హత్యకు గురైన బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించి.. వారి కుటుంబ సభ్యులను భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన బొడ్డు శ్రీధర్ గారిని హత్య చేశారు. కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు గారిదే ఈ హత్యకు బాధ్యత అని అన్నారు.

ఈ నియోజకవర్గంలో ఇది మొదటి హత్య కాదు. నాలుగు నెలల్లోనే ఇద్దరిని హత్య చేశారు. గతంలో మల్లేష్ యాదవ్‌ను, ఇప్పుడు శ్రీధర్ రెడ్డిని హత్య చేశారు. పేరుకేమో ప్రజాపాలన.. కానీ చేస్తున్నది ప్రతీకార పాలన. ప్రతీకారంతో రగిలిపోతూ ఎన్నికల్లో తనకు వత్తాసు పలకని వాళ్లను ప్రతీకారం తీర్చుకునే దిక్కుమాలిన కాంగ్రెస్ పాలన ఇది అని దుయ్యబట్టారు.

ఈ దారుణమైన హత్యకు ప్రధానంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సిందే. ఈ మంత్రి ఎప్పుడు లేని విధంగా తెలంగాణలో ఫ్యాక్షన్ సంస్కృతిని తీసుకొచ్చాడు. నాలుగు నెలల్లోనే రెండు హత్యలు జరిగాయంటే ఖచ్చితంగా దీని వెనుక మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రోద్భలం ఉంది. లేదంటే ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు అని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. మాకు ఈ స్థానిక పోలీసుల మీద నమ్మకం లేదు.. ఐతే సిట్ లేదంటే జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయాలి. నిజంగా ఇందులో ప్రభుత్వం, మంత్రి పాత్ర లేకపోతే నిష్పక్షిమైన విచారణ జరిగేందుకు ప్రభుత్వం సహకరించాలి అని తెలిపారు.

పదిరోజుల క్రితమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా మా నాయకులు డీజీపీని కలిసి ఈ ప్రాంతంలో కొత్తగా హింసాయుత సంస్కృతిని తీసుకొస్తున్నారని చెప్పటం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో దాడులు చేస్తూ చెలరేగిపోతున్నారు.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని పిటిషన్ ఇచ్చారు. ఈ ప్రాంతంలో పికెట్‌లు, క్యాంప్ పెట్టిలు ఈ ప్రాంతాల్లో కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలని కూడా కోరారు అని కేటీఆర్ గుర్తు చేశారు.

హత్య జరిగిన తర్వాత పది నిమిషాల్లో రావాల్సి ఉండగా గంటన్నర తర్వాత వచ్చి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు పోలీసులు. ముందుగా ఇక్కడ ఎస్సైని సస్పెండ్ చేయాలి. బాధ్యులైన పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలి. మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని ముందుగా బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా.. ప్రతీకారంతో మా కార్యకర్తలను హత్య చేయటం, గొంతు నొక్కటం చేస్తూ బలపడదాం అనుకుంటే అది ముఖ్యమంత్రి మూర్ఖత్వం, కాంగ్రెస్ పార్టీ పిచ్చితనం అవుతుంది అని పేర్కొన్నారు.

ఇవే దాడులు కొనసాగుతూ ఉంటే మా కార్యకర్తలను అదుపు చేయటం మాకు కూడా సాధ్యం కాదు. ఇలాంటి సంస్కృతి ఖచ్చితంగా తెలంగాణకు మంచిది కాదు. పదేళ్లలో రాష్ట్రంలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదు. ఇలాంటి హత్యలు, దారుణలకు వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే మేము కూడా వేల సంఖ్యలో అక్కడికి పోతాం.. అక్కడి మంత్రులు, అక్కడి నాయకుల ఇళ్ల ముట్టడిస్తాం.. కార్యకర్తలను కాపాడుకుంటాం అని హెచ్చరించారు.

శ్రీధర్ రెడ్డి గారి తండ్రి గారి బాధ చూస్తుంటే ఆయనను ఓదార్చలేకపోతున్నాం. శ్రీధర్ రెడ్డి గారి తండ్రి మంత్రి జూపల్లి కృష్ణారావు మీద కంప్లైంట్ చేస్తే ఆయన పేరు పెట్టొద్దని పోలీసులు ఒత్తిడి తెస్తున్నారంట. ఇది ఏ రకమైన ప్రభుత్వమో మనమంతా ఆలోచన చేయాలె అని అన్నారు.

రాహుల్ గాంధీ ఏమో మొహబ్బత్ కి దుకాన్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు. ఇదేనా మొహబ్బత్ కి దుకాన్? హత్యలు, దాడులు, ప్రతిపక్షాల పై కేసులు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే బెదిరింపులు, బైండోవర్లు. ఇవేనా కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు. ఈ సంస్కృతి కొనసాగితే తెలంగాణకు, ఎవరికీ మంచిది కాదు అని స్పష్టం చేశారు.

మాకు కూడా ఓపిక నశిస్తే జరిగే పరిణామాలకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. శ్రీధర్ రెడ్డి గారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం అని కేటీఆర్ హామీ ఇచ్చారు.