mt_logo

ధాన్యం తడిచి మొలకెత్తిందని కాంగ్రెస్ ప్రభుత్వం కొంటలేదు: హరీష్ రావుతో జగిత్యాల రైతులు

జగిత్యాల జిల్లాలోని పూడూరు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో వేచి చూస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని రైతులు తెలిపారు. ధాన్యం తడిచి మొలకెత్తిందని వడ్లను కొనమని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పండని సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పడం తమను మోసం చేయడమే అని రైతులు అన్నారు. తమ పక్షాన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని హరీష్ రావును కోరారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో  మాట్లాడుతూ.. అన్ని రకాల వడ్లకు రూ. 500 బోనస్ ఇవ్వాల్సిందే. లేకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాలను స్తంభింపచేస్తాం.. ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని స్పష్టం చేశారు.

అసెంబ్లీలో రైతుల పక్షాన మేము కొట్లాడుతాం. అసెంబ్లీ బయట రైతులందరూ ఏకమై ప్రభుత్వంపై పోరాటం చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లోని రైతులు ఇబ్బందులు పడుతున్నారు అని తెలిపారు.

రైతులకు ఇబ్బంది లేకుండా మూడు రోజుల్లోనే వడ్లను  కొంటున్నామని, తడిసిన కూడా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్తుంది, కానీ క్షేత్రస్థాయిలో వాస్తవానికి విరుద్ధంగా పరిస్థితులు ఉన్నాయి అని అన్నారు.

ఇక్కడే రమేష్ అనే రైతు ఉన్నారు, లక్ష్మారెడ్డి అనే రైతు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నెల రోజుల క్రితం ఈ పూడూరు వడ్ల కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చారు రాత్రి వర్షం పడి సంచులన్నీ తడిచిపోయనయి. చాలా మంది రైతులకు సంబంధించిన కుప్పల్లో ఇప్పటికే మొలకెత్తింది. ధాన్యం కొనుగోలు చేయక తీవ్రమైనటువంటి నష్టం జరిగింది అని ధ్వజమెత్తారు.

ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతలు గడప దాటని పరిస్థితి. కొనుగోలు కేంద్రాల్లో ఒక రైతు 40 రోజులు అయిందని, ఇంకొక రైతు 30 రోజులైంది వడ్లు ప్రభుత్వం కొనడం లేదు అని చెబుతున్నారు. చాలామంది రైతులు దాదాపు 100, 200 రూపాయలు తక్కువ ధరకు మధ్య దళారులకు అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చింది అని హరీష్ వాపోయారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఆరు గ్యారంటీల్లో భాగంగా 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి రైతులను మోసం చేసింది. మేము 100 రోజుల్లో రైతుబంధును రూ. 7,500 పెంచుతామని చెప్పి మోసం చేసిర్రు.
100 రోజుల్లో వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని అందరూ మోసం చేసిండ్రు. 100 రోజుల్లో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేసిండ్రు. 100 రోజుల్లో వ్యవసాయ కూలీలకు రూ. 12,000, కౌలు రైతులకు రూ. 15,000 ఇస్తామని మోసం చేసిండ్రు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు అని దుయ్యబట్టారు.

వడ్లు కొనడం కూడా ఈ ప్రభుత్వానికి చేతనైతే లేదు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం.. పోయిన యాసంగిలో 67 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటే, కాంగ్రెస్ 30 మెట్రిక్ టన్నుల కూడా కొనలేదు. రైతులు బయట అమ్ముకునే పరిస్థితి వచ్చింది. బాండ్ పేపర్ మీద రాసిచ్చి వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని ఇయ్యాల సన్నాలకు మాత్రమే ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఆ రోజు మీరు రాసిచ్చిన బాండ్ పేపర్ మీద పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , సిఎల్పీ లీడర్‌గా భట్టి విక్రమార్క సంతకాలు పెట్టారు అని అన్నారు.

మీరు సంతకాలు పెట్టి నమ్మబలికి బాండ్ పేపర్లు ఇచ్చి చేతులు పట్టుకొని ఇవాళ వడ్లకు బోనస్ ఏమయిందంటే చేతులు ఎత్తేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడితే రెండు లక్షల 97 వేల ఎకరాల్లో జగిత్యాల జిల్లాలో యాసంగి పంటలో వారి పంట పండితే ఇందులో 2,80,000 ఎకరాల్లో దొడ్డు వడ్లు ఉంటే 10 వేల ఎకరాల్లో మాత్రమే సన్నాళ్ళు వేశారు అని తెలిపారు.

లక్ష్మారెడ్డి అనే రైతు మాట్లాడుతూ జై శ్రీరామ్ అనే సన్న రకం వడ్లకు బయటనే 3,000 రూపాయలకు అమ్ముతున్నాము, గవర్నమెంట్ ఇచ్చేది ఏంది మాకు బయటనే  ఆరేడు వందల రూపాయలు సన్నాళ్లకు వస్తుంటే ప్రభుత్వం ఇస్తున్న రూ. 500 ఎందుకు అమ్ముతాము అంటున్నారు. రైతులు పండించేది రూపాయికి 90 పైసలు దొడ్డు రకం. సన్నాలకు బోనస్ ఇస్తామనడం  రైతులని దగా చేయడం, రైతుల గుండెల మీద తనడం తప్ప ఇంకోటి కాదు. బాధగలిగే విషయం ఏమిటంటే వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి అని కొంతమంది మొరుగుతున్నారు అని అంటున్నాడు అని అన్నారు.

ఇచ్చిన హామీ అమలు చేయమంటే రైతులను పట్టుకొని మొరుగుతున్నారు అంటున్నారు అంటే రైతులను కుక్కలు అంటున్నారా. రైతుబంధు అదిగితే రైతులను చెప్పుతో కొట్టాలని ఒక మంత్రి అంటున్నాడు .వడ్లకు బోనస్ ఎప్పుడు ఇస్తారు అంటే రైతులను కుక్కలు అని ఇంకొక మంత్రి అంటున్నాడు. రైతులను అవమానించేందుకేనా మిమ్మల్ని గెలిపించింది. పోరాటానికి సిద్ధంగా ఉన్నాం అని రైతులు చెపుతున్నారు. పార్లమెంటు ఎన్నికలు అయిపోగానే సన్నవడ్లకే బోనస్ అని రైతులను మోసం చేశారు అని హరీష్ విమర్శించారు.

ప్రభుత్వం, మంత్రులు ఇప్పటికైనా మేల్కొని హైదరాబాద్‌లో కూర్చోకుండా క్షేత్రస్థాయిలో వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించి తడిసిన మొలకెత్తిన వడ్లను కొని రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఆని హరీష్ తెలిపారు.