mt_logo

రాజముద్ర నుండి కాకతీయ తోరణం, చార్మినార్‌లను తీసేయాల్సిన అవసరం, అర్జెన్సీ ఏమొచ్చింది: కేటీఆర్

బీఆర్ఎస్ నాయకులతో కలిసి చార్మినార్‌ను సందర్శించిన అనంతరం భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. గత పదేళ్లలో ప్రభుత్వంలో జరిగిన మంచిని ప్రజలకు చెప్పాలి. కానీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొండిగా వ్యవహరిస్తోంది. గత పదేళ్లలో జరిగిన మంచిని, అభివృద్ధిని పట్టించుకోకుండా ఒక రాజకీయ దుగ్ద, కక్షతో వ్యవహరిస్తోంది అని దుయ్యబట్టారు.

పదేళ్లలో ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావారణంలో జరగాలి. పదేళ్లలో జరిగిన అభివృద్ధిని గుర్తించకుండా మూర్ఖ, మొండి వైఖరితో కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. కేసీఆర్ గారికి పేరు రావొద్దొని, కేసీఆర్ గారి పేరు వినబడవద్దనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోంది అని విమర్శించారు.

తెలంగాణ అనగానే హైదరాబాద్, వరంగల్ గుర్తొస్తాయి. కాకతీయ సామ్రాజ్యపు వారసత్వ సంపద కాకతీయ కళాతోరణం. తెలంగాణ వారసత్వ సంపద, సంస్కృతికి గుర్తులుగా ఉన్న చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని రాజముద్ర నుంచి తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని పేర్కొన్నారు.

చార్మినార్‌ను తొలగించటమంటే ప్రతి హైదరాబాదీని అవమానపర్చినట్టే.. ప్రతి ఒక్కరిని అగౌరవపరిచినట్టే. మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చామని, మేలు చేయమని, పథకాలు అమలుచేయమని, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని.. ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు విరమించుకోండి.. ప్రజలు, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించకండని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఆని కేటీఆర్ తెలిపారు.

తెలంగాణ షాన్ హైదరాబాద్.. హైదరాబాద్ ప్రతీక చార్మినార్. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ అంటే దాని ప్రతీక చార్మినార్ అన్నట్లుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. తెలంగాణ రాజముద్రలో చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తొలగించాలనే నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు.

వీటిని ఇప్పుడు తీసేయాల్సిన అవసరం, అర్జెన్సీ ఏమీ వచ్చిందని ప్రశ్నిస్తున్నాం. ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే విరమించుకోకపోతే తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపడతాం. ప్రభుత్వం ఇప్పటికైనా తన మూర్ఖపు వైఖరి మానుకోవాలని కోరారు.