mt_logo

పదేళ్ల మోడీ పాలనలో తెలంగాణకు దక్కింది అన్యాయాలు, అవమానాలు, అవహేళనలే: కేటీఆర్

తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలి అని ప్రశ్నిస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు.. పదేళ్ల మీ పాలనలో.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు దక్కింది అన్యాయాలు, అవమానాలు, అవహేళనలే అని పేర్కొన్నారు.

ఉత్తర కాశీని మాత్రం అందంగా తీర్చిదిద్దారు.. దక్షిణ కాశీగా భావించే వేములవాడకు ఏమిచ్చారు? వరంగల్ జిల్లాకు మరోసారి వచ్చి వెళ్లారు.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ హామీని మాత్రం మరిచారు.. బయ్యారం స్టీలు ఫ్యాక్టరీని మరోసారి బొందపెట్టారు అని దుయ్యబట్టారు.

దేశ అత్యున్నత చట్ట సభైన పార్లమెంట్ సాక్షిగా.. తల్లిని చంపి బిడ్డను బతికించారని అవమానించారు. పురిట్లోనే ఏడు మండలాలు లాక్కొని అన్యాయం చేశారు.. బియ్యం కొనమంటే నూకలు తినమని అవహేళన చేశారు. ఇంత ధాన్యం ఎలా పండిందని రైతుల శక్తిని అనుమానించారు. పార్లమెంట్‌లో ఇచ్చిన విభజన హామీలకు పదేళ్లుగా పాతరేశారు అని విమర్శించారు.

పక్కనున్న కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణ జాతికి మాత్రం మొండిచేయి చూపారు.పదేళ్లు మీ భజన తప్ప..విభజన హామీలు సాధించని బీజేపీ ఎంపీలకు
తెలంగాణ ప్రజలు ఎందుకు మళ్లీ ఓటేయాలి అని ప్రశ్నించారు.

అందుకే.. లక్షలాది మందికి ఉపాధినిచ్చే ఐటీఐఆర్ ప్రాజెక్టును
ఆగం చేసిన బీజేపీకి బుద్ధిచెప్పేందుకు యువత సిద్ధం. మోటార్లకు మీటర్లు పెట్టాలని మెడపై కత్తి పెట్టినందుకు.. ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వనందుకు.. కమలం పార్టీకి కర్రుగాల్చి వాత పెట్టేందుకు రైతులు సిద్ధం అని కేటీఆర్ అన్నారు.

నిత్యవసర వస్తువుల ధరల మోత మోగించి. .పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపిన ఎన్డీఏకు గుణపాఠం చెప్పేందుకు మహిళాలోకం సిద్ధం. పదేళ్లలో ఒక్క ప్రభుత్వ విద్యాసంస్థ ఇవ్వకుండా..ఆగంచేసిన బీజేపీకి గుణపాఠం చెప్పేందుకు విద్యార్థులు సిద్ధం.. నూకలు తినమని అవమానించిన బీజేపీ తోకలు కట్ చేయడానికి మొత్తం తెలంగాణ ప్రజలు సిద్ధం అని స్పష్టం చేశారు.

ప్రధాని గారు.. మీ ప్రాధాన్యతా క్రమంలో తెలంగాణ లేనప్పుడు
తెలంగాణ ప్రజల ప్రాధాన్యతల్లో బీజేపీ ఎలా ఉంటుంది.. పదేళ్లలో ఏం చేశారో.. విషయం చెప్పమంటే.. మళ్లీ విషం చిమ్మి వెళ్లారు. డబుల్ ఆర్ టాక్స్ వసూలు చేస్తున్న ఛోటాభాయిపై చర్యలకు మాత్రం వెనకాడుతున్నారు అని ధ్వజమెత్తారు.

రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు జేబు సంస్థలతో వెంటాడి.. వేటాడుతున్నారు. ఉత్తర భారతంలో మోడీ వేడి తగ్గడంతో
దక్షిణాదిపై బీజేపీ దండయాత్రను సాగిస్తున్నారు. చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ ప్రజలు.. మీ పదేళ్ల  పరిపాలనా తీరు చూశారు. ప్రచార పర్వాన్నీ నిశితంగా గమనిస్తున్నారు అని తెలిపారు.

ఎవరెంత మభ్యపెట్టే ప్రయత్నం చేసినా…ఇక్కడ అటెన్షన్ డైవర్షన్ కు ఆస్కారం లేదు. ఎందుకంటే.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో.. విభజన హామీలే ప్రధాన అంశాలు…ప్రజా సమస్యలే ఎన్నికల ఎజెండా అని కేటీఆర్ పేర్కొన్నారు.