శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గురుకుల పాఠశాలలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు గురుకుల, సాంఘిక సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ సమాధానం ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రక్షాళన చేసి బలోపేతం చేశాం.. గురుకుల పాఠశాలలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రెసిడెన్షియల్ స్కూళ్ళలో మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ తేదీ వరకు 603 కొత్త గురుకుల పాఠశాలలు ప్రారంభించాము. ఈ పాఠశాలల కోసం అద్దెకు తీసుకున్న భవనాల కోసం రూ. 174 కోట్ల 25 లక్షలు ఖర్చు చేస్తున్నాం. ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ 104, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ 53, మైనార్టీ వెల్ఫేర్ స్కూల్స్ 204, బీసీ వెల్ఫేర్ స్కూల్స్ 242 ప్రారంభించాం. ఈ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వార్షికంగా ఒక్కో విద్యార్థిపై రూ. 57,282 ఖర్చు చేస్తున్నామని వివరించారు.
రాష్ట్రంలో మొత్తం 970 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ పాఠశాలల్లో మొత్తం 4 లక్షలకు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 71 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను ఇంటర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తున్నామన్నారు. సమైక్య రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క సైనిక్ స్కూల్ ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక ఎస్సీ, ఎస్టీల కోసం మూడు సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేశాం. రోబోటిక్ ల్యాబ్స్, కంప్యూటర్ సైన్స్ గురుకుల పాఠశాలల్లో నిర్వహిస్తున్నాం. నాసా, అంతరిక్ష ప్రయోగాల్లో గురుకుల విద్యార్థులు పాల్గొంటున్నారు. మెడికల్ సీట్లను అత్యధిక స్థాయిలో సాధిస్తున్నారు. గురుకుల పాఠశాలల ప్రవేశాల్లో ఎమ్మెల్యేలకు కోటా కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని కొప్పుల ఈశ్వర్ చెప్పారు.