ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న పార్టీ ప్లీనరీ సమావేశాల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, 14 ఏళ్ళు అలుపెరుగని పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని, కొత్త రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారిగా పార్టీ బహిరంగ సమావేశం నిర్వహించుకుంటోందని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరువయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైనా ఉందని సీఎం సూచించారు. రాష్ట్రంలో జలసిరులు కురిసేందుకు చేపట్టిన మిషన్ కాకతీయ, ఇంటింటికీ మంచినీరు ఇచ్చే బృహత్తర పథకం వాటర్ గ్రిడ్, ఆసరా తదితర పథకాలను రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హాస్టళ్లకు సన్నబియ్యం ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని, ఆ ఆలోచన వచ్చిన మరుక్షణమే అమలుపెట్టిన ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ కే ఈ క్రెడిట్ దక్కుతుందని కేసీఆర్ ఈటెలను ప్రశంసించారు.
రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద సమస్య విద్యుత్ అని, ఆ సమస్యను టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో అధిగమించామని, ప్రస్తుతం రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవని, రానున్న రెండున్నరేళ్ళలో 24వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిందని, 17వేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేసిందని, రాబోయే రెండేళ్లలో నిరుద్యోగ యువతకు లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.