టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు ఆదివారం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో సంపూర్ణ మెజారిటీ సాధించిన కేసీఆర్ ను గవర్నర్ నరసింహన్ అభినందిస్తూ, ‘మీ కలను సాకారం చేసుకుని అనుకున్న లక్ష్యం సాధించారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేసుకోండి.’ అని సూచించారు. అనంతరం టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో పార్టీ నేతలంతా కలిసి ఏకగ్రీవంగా కేసీఆర్ ను టీఆర్ఎస్ఎల్పీ నాయకుడిగా ఎన్నుకున్న తీర్మాన ప్రతిని గవర్నర్ కు అందజేశారు.
అపాయింటెడ్ డే తర్వాతే ప్రమాణస్వీకారం పెట్టుకోవాల్సిందిగా గవర్నర్ కేసీఆర్ కు సూచించగా అందుకు కేసీఆర్ ఒప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉందని, అందుకు మీ సహకారం తప్పకుండా కావాలని కేసీఆర్ అడుగగా గవర్నర్ సానుకూలంగా స్పందించారు.
అనంతరం ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ దగాపడ్డ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే శక్తి, దమ్ము, ధైర్యం ఒక్క కేసీఆర్ కు మాత్రమే ఉందని, ప్రజలంతా కూడా ఇలానే భావించి టీఆర్ఎస్ కు సంపూర్ణ మెజారిటీ ఇచ్చారని, అందుకే శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ ను ఎన్నుకున్నామని తెలిపారు. మానిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని, అపాయింటెడ్ డే తర్వాత ప్రమాణస్వీకారం ఉంటుందని ఈటెల చెప్పారు. గవర్నర్ ను కలిసిన వారిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, రసమయి బాలకిషన్, రాజయ్య, బొడిగె శోభ, ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.