mt_logo

అమరావతి నేర్పిన పాఠం ఏమిటి?

By: కట్టా శేఖర్‌రెడ్డి

తెలంగాణలో కేసీఆర్‌పై కత్తులు దూస్తున్న టీటీడీపీ నాయకులు ఎప్పటికైనా తనకు ఉపయోగపడతారన్న నమ్మకం చంద్రబాబుకు లేదు. వారు రానురాను తనకు దూరమవుతారని కూడా ఆయనకు బాగా అర్థమయింది. ఎవరెవరు ఎవరితో మంతనాలు జరుపుతున్నారో కూడా చంద్రబాబుకు సమాచారం ఉంది. వీళ్ల కోసం ఎల్లకాలం కేసీఆర్‌తో గొడవపడాల్సిన పనిలేదని చంద్రబాబు సన్నిహితులు ఆయనకు బోధిస్తున్నారు. అందుకే ఆయన కేసీఆర్‌తో సహృద్భావం కోసం ఒక అడుగు ముందుకు వేశారు. అమరావతి శంకుస్థాపనను ఒక అవకాశంగా తీసుకున్నారు. కేసీఆర్ కూడా రాజనీతిజ్ఞునిగా వ్యవహరించారు.

అమరావతి శంకుస్థాపన సంరంభం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకున్నట్టు గొప్ప సంబరంగా జరిగింది. ఎంత ఖర్చు, ఎంత ప్రజాస్వామికం అన్న ప్రశ్నల జోలికి వెళ్లకుండా చూస్తే ఒక కొత్త రాష్ట్రం పడే పాట్లన్నీ చంద్రబాబు ఈ సందర్భంగా పడ్డారు. ప్రతిఘటన, విమర్శ అన్నీ దాటుకుని, వాటిని అప్రాధాన్యం చేసి ఆయన ఈ సంబరం జరిపించారు. అయితే శంకుస్థాపన సభ పూర్తికాగానే కేంద్రంపై ఆంధ్ర మీడియా విరుచుకుపడిన తీరు, నరేంద్ర మోదీతో తగవు పడిన తీరు ఆంధ్ర నాయకత్వం అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదని తెలియజేస్తుంది. అంతా ఒక పద్ధతి ప్రకారం ఈ ప్రచారదాడి జరిగినట్టుగా కనిపిస్తున్నది. రాష్ట్ర విభజన సమయంలో కూడా ఆంధ్ర నాయకత్వం తమకు ఏమి కావాలో మాట్లాడకుండా ఏది జరుగదో అది కావాలని పీఠం వేసుకుని పంచాయితీ చేసుకుంటూ కూర్చున్నది.

రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి, విభజన బిల్లు చివరి నిమిషం దాకా పార్లమెంటు గడపదాటకుండా చూడడానికి ప్రయత్నించారే తప్ప విభజన జరిగితే తమకు ఏమి నష్టమో, తమకు ఏమి కావాలో గట్టిగా కోరలేకపోయారు. ఇవ్వాళ దీర్ఘాలు తీసి మాట్లాడుతున్న ఆంధ్ర కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకులంతా ఆరోజు పార్లమెంటులో ఉన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి, బొత్స ఝాన్సీరాణి, ఉండవల్లి అరుణ్‌కుమార్, కొనకళ్ల నారాయణ… మొదలైన వాళ్లంతా పార్లమెంటులో ప్లకార్డులు పట్టుకుని చేసిందేమిటో రెండు రాష్ట్రాల ప్రజలూ చూశారు. రాష్ట్ర విభజనకు అడ్డంగా నిలబడ్డారు. స్పీకర్‌ పట్ల దురుసుగా వ్యవహరించారు.

విభజన బిల్లు పార్లమెంటు ఆమోదం పొందకూడదని విశ్వ ప్రయత్నం చేశారు. విచిత్రం ఏమంటే వారి పార్టీలేమో విభజనకు అనుకూలంగా లేఖలు, తీర్మానాలు చేశాయి. వీరేమో పచ్చి అవకాశవాదులుగా మారి అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరించారు. విభజనకు వ్యతిరేకంగా మాట్లాడారుతప్ప, వారెవరూ మాకిది కావాలి అని పార్లమెంటులో ఆరోజు అడగలేదు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్‌కు ఏదైనా కావాలని అడిగింది నాకు తెలిసి ఒక్క వెంకయ్యనాయుడే.

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, ప్రత్యేక హోదా కల్పించడం, తెలంగాణ నుంచి ఏడు మండలాలను లాగేయడం వంటి వన్నీ ఆయన డిమాండ్లే. కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం కూడా ఆంధ్ర నాయకత్వాన్ని మెప్పించడానికి కొన్ని జాతీయ సంస్థలను ఇవ్వడం, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించడం వంటి నిర్ణయాలు చేసింది. అప్పుడే కనుక ఆంధ్ర నాయకత్వం అంతా ఉమ్మడిగా తమకు కావలసిన డిమాండ్ల గురించి పార్లమెంటు లోపలా బయటా కొట్లాడి ఉంటే ఇవ్వాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టి ఉంటే ఆ క్షణాల్లో కేంద్రం కూడా ఇచ్చి ఉండేదేమో. అప్పుడు ప్రత్యేక హోదా అడిగితే విభజనకు ఒప్పుకున్నట్టవుతుందని నాటకమాడి పోటీలు పడి ఆంధ్ర ప్రజలను మోసం చేశారు. రాజకీయ మైలేజీ కోసం చాలా మూర్ఖంగా, అప్రజాస్వామికంగా వ్యవహరించాయి అన్ని పార్టీలు.

ఇప్పుడు కూడా అదే తప్పిదం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి మేలు చేయడం, బీజేపీని బద్నాం చేయడం కోసం కొన్ని మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు, టీడీపీ-బీజేపీలను రెంటినీ బోనులో నిలబెట్టడం కోసం మరికొన్ని పార్టీలు, మీడియా సంస్థలు మోడీపై విరుచుకుపడుతున్నాయి. అందరూ కలిసి చేస్తున్నదేమంటే ఆంధ్ర ప్రజలను సంక్షోభ మానసికస్థితి నుంచి బయటికి రాకుండా చూస్తున్నారు. వారికి భవిష్యత్తుపై విశ్వాసాన్ని కల్పించడానికి బదులు, నిరంతరం గగ్గోలు పుట్టిస్తున్నారు.

నరేంద్ర మోదీకి లేక కేంద్రానికి సమర్థనగా ఇది రాయడం లేదు. ఒక ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగే విధంగా వ్యవహరిస్తున్న ఆంధ్ర పార్టీలు, మీడియా వ్యూహాత్మక తప్పిదాన్ని గుర్తు చేయడం కోసమే ఈ వాదన. ఇప్పుడు కూడా సంఘటితంగా ఉండి రాష్ట్రానికి ఏమేమి కావాలో డిమాండు చేసి ఉంటే బాగుండేది. చంద్రబాబు, జగన్, రఘువీరా ఒకే వేదిక నుంచి కేంద్రాన్ని అడిగి ఉంటే పరిస్థితి మరోరకంగా ఉండేది. ఐదేళ్లకు ఒకసారి చేయాల్సిన రాజకీయాలను పార్టీలు నిత్యకృత్యంగా మార్చుకోవడం వల్ల ప్రజలు నిమ్మళంగా ఉండలేకపోతున్నారు.

నరేంద్ర మోదీ తెలంగాణ ఏర్పాటును ఇప్పటికీ జీర్ణించుకోలేదని ఆయన ప్రసంగం తెలియజేసింది. ఎన్నికలకు ముందు మాట్లాడిన తీరులోనే ఆయన అమరావతి శంకుస్థాపన సభలో మాట్లాడారు. ఆంగ్లేయులు చేసినట్టు చేశారని, సంపదలను ధ్వంసం చేశారని ఆయన మాట్లాడారు. రెండూ అబద్ధాలే అని ఆయనకు తెలుసు. ఆంధ్ర ప్రజలకు ఏమీ హామీ ఇవ్వలేక కాంగ్రెస్‌ను బద్నాం చేయడం కోసం ఆయన ఈ వాదన చేసి ఉండవచ్చు. విభజన ప్రక్రియలో మొదటి నుంచి చివరిదాకా బీజేపీ ఉంది. బీజేపీ మద్దతుతోనే పార్లమెంటులో బిల్లు చట్టరూపం దాల్చింది. ఆంగ్లేయులనవలసి వస్తే కాంగ్రెస్‌తోపాటు బీజేపీని కూడా అనాల్సి ఉంటుంది. సంపదలను ధ్వంసం చేశారనే వాదన మరీ అధ్వాన్నమైన ఆరోపణ. విభజన సంపదలను సృష్టించింది. ఇవ్వాళ రెండు ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణం పెద్ద ఎత్తున సంపదలను సృష్టిస్తున్నది.

అధికార వికేంద్రీకరణ ఫలాలను ఇవ్వాళ ఆంధ్ర, తెలంగాణ ప్రజలు ఇద్దరూ అనుభవిస్తున్నారు. విభజన సమయంలో మేము ఇంతదూరం ఆలోచించలేదు. ఇంతదూరం ఊహించలేదు. హైదరాబాద్‌పై ఉన్న మోహం వల్ల కావచ్చు మేము విభజనను జీర్ణించుకోలేకపోయాం. కానీ ఇప్పుడు మా కళ్లను మేమే నమ్మలేకపోతున్నాం. ఇవ్వాళ ప్రభుత్వం మా ముందుకు వచ్చింది. మంత్రులు మా కళ్ల ముందు తిరుగుతున్నారు. ఒక విధంగా మేమంతా కేసీఆర్‌కు రుణపడి ఉన్నాం అని విజయవాడకు చెందిన మిత్రుడొకరు చెప్పారు. కేసీఆర్ అమరావతి శంకుస్థాపనకు వెళ్లాలా వద్దా అన్న చర్చ వచ్చినప్పుడు ఒక సీనియర్ జర్నలిస్టు మిత్రుడిని అడిగాను వస్తే ఎలా ఉంటుంది అని. నేను రెండు మాసాలుగా ఆంధ్ర అంతటా తిరుగుతున్నాను. కేసీఆర్‌పై ఇప్పుడు ఆరాధన భావం తప్ప వ్యతిరేకత లేదు.

ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ పేరు తలుచుకోని సందర్భం లేదు. కేసీఆర్ ముందుగా అంత ఫిట్‌మెంటు ఇచ్చి ఉండకపోతే మా రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబునాయుడు ఇచ్చి ఉండేవారు కాదని వారు చెబుతున్నారు. ఇక్కడ ఏర్పాటవుతున్న కేంద్ర సంస్థలు, వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి, హడావిడి ఇక్కడి జనంలో ఆశలు రేకెత్తిస్తున్నది. ఇదంతా విభజన వల్లనే జరిగింది కదా అని భావిస్తున్నారు. కేసీఆర్ వస్తే ఇక్కడ హర్షధ్వానాలు తప్ప వ్యతిరేకత ఉండదు అని ఆ మిత్రుడు చెప్పారు. కేసీఆర్‌కు అమరావతిలో లభించిన స్వాగత సత్కారాలు, ఆయన లేచి నిలబడి మాట్లాడుతున్నప్పుడు వ్యక్తమయిన హర్షధ్వానాలు ఆ మిత్రుడు చెప్పింది నిజమేనని రుజువు చేశాయి.

ఆంధ్రలో ధ్వంసమేదీ జరుగలేదని, అక్కడ కొత్తగా నిర్మాణం జరుగుతున్నదని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమున్నది? విభజన జరిగినా తమకు పెద్దగా రాజకీయ ప్రయోజనం లభించలేదని మోదీ భావిస్తుండవచ్చు. ఆ దుగ్ధకొద్దీ విభజనపై ఆయన తరచూ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుండవచ్చు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుహృద్భావంతో ఒక్కవేదికపైకి వచ్చిన వేళ నరేంద్ర మోదీ ఇటువంటి మాటలు మాట్లాడవలసిన అవసరం ఏముంది? ప్రత్యేక హోదా ఎగ్గొట్టదల్చుకుంటే అది ఆయన సమస్య. అందుకు విభజననెందుకు బద్నాం చేయడం?

కేసీఆర్ ఈ సభకు రాకూడదని చంద్రబాబు మిత్రులు కొందరు, ప్రత్యర్థులు అందరూ ఆశించారు. చంద్రబాబు వీరి ఆకాంక్షలను తోసిరాజని కేసీఆర్ ఇంటికి వచ్చి మరీ స్వాగతించారు. చంద్రబాబుకు అమరావతిలో నెగ్గడం ముఖ్యం. ఆంధ్రలో విజయాలు సాధించడం అవసరం. కేసీఆర్‌తో పేచీలు పెట్టుకుని రచ్చ చేసినంత మాత్రాన తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వస్తామన్న గ్యారెంటీ లేదు. ఓటుకు నోటు కేసు చంద్రబాబు ధైర్యాన్ని బాగా దెబ్బతీసింది. తెలంగాణలో కేసీఆర్‌పై కత్తులు దూస్తున్న టీటీడీపీ నాయకులు ఎప్పటికైనా తనకు ఉపయోగపడతారన్న నమ్మకం చంద్రబాబుకు లేదు. వారు రానురాను తనకు దూరమవుతారని కూడా ఆయనకు బాగా అర్థమయింది. ఎవరెవరు ఎవరితో మంతనాలు జరుపుతున్నారో కూడా చంద్రబాబుకు సమాచారం ఉంది. వీళ్ల కోసం ఎల్లకాలం కేసీఆర్‌తో గొడవపడాల్సిన పనిలేదని చంద్రబాబు సన్నిహితులు ఆయనకు బోధిస్తున్నారు. అందుకే ఆయన కేసీఆర్‌తో సుహృద్భావం కోసం ఒక అడుగు ముందుకు వేశారు. అమరావతి శంకుస్థాపనను ఒక అవకాశంగా తీసుకున్నారు. కేసీఆర్ కూడా రాజనీతిజ్ఞునిగా వ్యవహరించారు.

సభలో కూడా ఆయన క్లుప్తంగా హుందాగా మాట్లాడి జనం నుంచి జేజేలు పొందారు. మిగతా విషయాలు ఎలా ఉన్నా చంద్రబాబుకు పట్టుబట్టే తత్వం, కష్టపడే తత్వం, సాధించే తత్వం ఉన్నాయి. రాజధాని నిర్మాణం చాలా పెద్దపని. చాలా పెద్ద సవాలు. దానిని ఆయన భుజం మీద వేసుకున్నారు. రాజధాని స్థలాన్ని ఎంచుకోవడంలో కూడా ఆయన సరైన నిర్ణయమే తీసుకున్నారు. విజయవాడకు రాజధాని 1953లోనే రావలసింది. అప్పుడే విజయవాడ రాజధాని అయి ఉంటే ఆంధ్ర పరిస్థితి మరోలా ఉండేదేమా. కానీ రాజకీయ కుట్రల పర్యవసానంగా ఒక్క ఓటు ఆధిక్యంతో కర్నూలు రాజధాని అయింది. విజయవాడ రాజధాని అయితే కమ్యూనిస్టుల పెత్తనం వస్తుందని అప్పట్లో మోతుబరి రాజకీయ నాయకులంతా నీలం సంజీవరెడ్డి, ప్రకాశం వంటి వారి మాటలు విని విజయవాడకు వ్యతిరేకంగా ఆంధ్రేతర ఎమ్మెల్యేలను నలుగురిని తీసుకొచ్చి ఓటేయించారు.

ఇంతకాలానికి ఇప్పుడు రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రకు మంచి ప్రదేశంలో రాజధాని వస్తున్నది. సారవంతమైన భూములను ఎలా లాక్కుంటారని కొందరు ప్రశ్నించవచ్చు. సారవంతమా, కాలువ కింద భూములా, మెట్ట భూములా అన్నదానితో నిమిత్తం లేకుండా ఏ భూమినయినా వదులుకోవాలంటే రైతుకు బాధ ఉండటం సహజం. భూమితో రైతుకు ఉండే అనుబంధం అటువంటిది. ఎవరయినా వారిని మెప్పించి భూసమీకరణ చేయాల్సిందే. శంషాబాద్ విమానాశ్రయం కోసం భూసేకరణ చేసినప్పుడు కూడా ఇటువంటి గోల చూశాం.

ఏ ప్రాజెక్టు కోసం భూసేకరణ జరిగినా ఈ సమస్య చూస్తున్నాం. కొత్త నిర్మాణం జరగాలంటే కొంత వినిర్మాణం అనివార్యం. రాజధాని దొనకొండలో పెట్టినా ఈ సమస్య ఉండేదే. పూర్తిగా మెట్ట ప్రాంతమయినా రైతులు అక్కడా గొడవ చేసి ఉండేవారు. ఇప్పుడు చంద్రబాబు చేయవలసిందల్లా రాజధానికి రైతు శాపం తగలకుండా చూసుకోవాలి. వారిని అక్కున చేర్చుకుని, రాజధానిలో భాగస్వాములను చేయాలి. తాము పరాయీలమై పోయామన్న భావన వారిలో కలిగితే రాష్ట్రానికి, రాజధానికి మంచిది కాదు.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *