mt_logo

హైదరాబాద్ నగరానికి డిసెంబర్ 15 నాటికి గోదావరి జలాలు– కేటీఆర్

– హైదరాబాద్ నగరంలోని తాగునీటి మీద HMWS అధికారులతో సమీక్ష
– గోదావరి మెదటి దశ, కృష్టా మూడవ ఫేజ్ పనులు జరుగుతున్న తీరుపై ఆరా
– డిసెంబర్ 15 నాటికి నగరానికి గోదావరి జలాలు
– టోలిచౌకి, ప్రశాసన్ నగర్ ప్రాంతాల్లోని గ్యాప్ వర్క్ పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశం
– 1900 కోట్ల ప్యాకేజీతో పది శివారు మున్సిపాలిటీలకి త్రాగునీరు
– ఈ ప్యాకేజి పనులకి ఒక్కరోజులోనే జీవో MS138 ఇప్పించిన మంత్రి

హైదరాబాద్ నగరంలో నిరంతరం మంచినీళ్లు సరఫరా చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులకి పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు సూచించారు. బుధవారం నాడు బంజారాహిల్స్ లోని తన క్యాంపు కార్యాలయంలో HMWS అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాబోయే వేసవికి నగర ప్రజలకి ఎలాంటి తాగునీటి కొరత లేకుండా చూసేందుకు కావాల్సిన నీటి సరఫరా చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. గోదావరి, కృష్ట నదుల నుంచి నీళ్ళు తీసుకువచ్చేందుకు జరుగుతున్న పనుల మీద మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదావరి మెదటి దశ నీటి సరఫరా పనుల్లో షామీర్ పేట్, గుండ్ల పోచంపల్లి వద్ద జరుగుతున్న పనులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ రెండు చోట్ల పనులు పూర్తయితే సుమారు 86 యంజిడి గోదావరి నీళ్లు నగరానికి వస్తాయని అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన మేరకు నగరానికి డిసెంబర్ 15 నాటికి గోదావరి జలాలు అందిస్తామని సమీక్ష అనంతరం మంత్రి కె. తారక రామారావు తెలిపారు.

కృష్టా మూడవ ఫేజ్ పనులను నిర్వహిస్తున్న కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులు, అధికారులతో సమావేశమైన మంత్రి అన్ గోయింగ్ పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా టోలిచౌకి, ప్రశాసన్ నగర్ ప్రాంతాల్లో జరుగుతున్న రింగ్ మెయిన్ పైపు గ్యాప్ వర్క్ పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని అదేశించారు. కేవలం తమకి రాత్రి సమయంలో మాత్రమే పనులు నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చారని, దీంతో పనులు కాస్త మెల్లిగా నడుస్తున్నాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. వరుసగా సెలవులు ఉన్న నేపథ్యంలో రోజంతా పనులు చేసుకునేలా అనుమతి ఇవ్వాలని నగర కమీషనర్ మహేందర్ రెడ్డిని మంత్రి ఫోన్లో కోరారు. కమీషనర్ వెంటనే వారం రోజుల పాటు పగటి సమయంలోనూ పనుల చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. అయితే పనులు జరిగే ప్రదేశాల్లో ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సైన్ బోర్డులు వేయాలని, అక్కడి డైవర్షన్ రోడ్లను ఒక్కరోజులోగా మరమత్తు చేయాలని జీహెచ్ఎంసీ కమీషనర్ సోమేష్ కుమార్‌ని మంత్రి అదేశించారు. ఈ పనులు పూర్తయితే 45 యంజిడి నీరు ప్రశాసన్ నగర్ రిజర్వాయర్ కి చేరుతుందని, దీంతో కూకట్ పల్లి, ఖైరతాబాద్, శేరిలింగంపల్లిల్లోని ప్రాంతాలకి నీటి సరఫరా మెరుగవుతుందని మంత్రి సమీక్షానంతరం తెలిపారు.

సుమారు 1900 కోట్ల ప్యాకేజీతో 10 శివారు మున్సిపల్ సర్కిళ్ల గ్రామాలకి నీళ్లు అందించేందుకు రూపొందించిన ప్రతిపాదనలను అధికారులతో మంత్రి చర్చించారు. ఈ కార్యక్రమానికి 1700 కోట్ల రూపాయల అర్ధిక సాయానికి హడ్కో నుంచి అధికారికంగా వచ్చిన హామీపత్రాన్ని మంత్రికి జలమండలి అధికారులు చూపించారు. అయితే ఈ ప్యాకేజీ తాలూకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పాలనాపరమైన అనుమతులను వేగంగా ఇప్పించాలని అధికారులు మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. సంబంధిత శాఖాధికారులతో మాట్లాడి వెంటనే జీవోని సైతం ఇప్పించారు. ఈ మేరకి పాలనాపరమైన అనుమతులిస్తూ ప్రభుత్వం బుధవారం జీవో MS138 జారీ చేసింది. వచ్చే నెల మొదటి వారంలోగా ఈ కార్యక్రమానికి టెండర్లు పిలించేందుకు సిద్దంగా అన్నిపనులు పూర్తి చేయాలని మంత్రి అధికారులను అదేశించారు. ఈ సమావేశంలో జలమండలి ఎండీ జనార్ధన్ రెడ్డి, కాంట్రాక్టర్ ఏజెన్సీ అయిన MEIL కంపెనీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిలతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *