mt_logo

దేశానికి తెలంగాణ మార్గదర్శి : కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అపార అనుభవం ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఎంతో అవసరమని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి అభిప్రాయపడ్డారు. సకల వర్గాలతో కలిసి ముందుకు సాగి, శాంతియుతంగా ఉద్యమించి తెలంగాణను సాధించి.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కేసీఆర్‌ నెరవేరుస్తున్నారని కొనియాడారు. దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటులో కేసీఆర్‌ క్రియాశీల భూమిక పోషించాలని కోరారు. ఇందుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.

సీఎం కేసీఆర్‌ త్వరలోనే జాతీయ పార్టీని ప్రకటించనున్నారనే వార్తలను స్వాగతించారు. వర్తమాన జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శూన్యత నెలకొన్న నేపథ్యంలో కేసీఆర్‌ లాంటి సీనియర్‌ నాయకుడి అవసరం దేశానికి ఎంతో ఉన్నదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌తో కుమారస్వామి ఆదివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. కుమారస్వామికి కేసీఆర్‌ సాదర స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాల్క సుమన్‌, ఎస్‌ రాజేందర్‌రెడ్డి ఉన్నారు. ఇద్దరు నేతల మధ్య దాదాపు మూడు గంటలపాటు అర్థవంతమైన చర్చ జరిగిందని కుమారస్వామి తెలిపారు. తెలంగాణ కోసం ఉద్యమించిన తీరు.. రాష్ట్ర సాధన.. అనంతరం ప్రగతిపథంలో తెలంగాణను నడిపిస్తున్న విధానంపై చర్చ జరిగింది.

ఎనిమిదేండ్ల స్వల్పకాలంలోనే తెలంగాణ సాధించిన అభివృద్ధిపై దేశమంతా చర్చిస్తున్నదని కుమారస్వామి తెలిపారు. తమకూ ఈ అభివృద్ధి కావాలని దేశమంతా కోరుకొంటున్నదని చెప్పారు. తెలంగాణలో మాత్రమే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, ఉచిత తాగునీరు, సాగునీరు, వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని ప్రశంసించారు. తెలంగాణ పథకాలపై కర్ణాటకతోపాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చను సీఎం కేసీఆర్‌తో పంచుకొన్నారు. తెలంగాణ మాడల్‌ దేశవ్యాప్తంగా అనతి కాలంలోనే ప్రశంసలు అందుకోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తంచేశారు. దేశానికి తెలంగాణ మాడల్‌ అవసరమున్నదని అభిప్రాయపడ్డారు.

దేశంలో విచ్ఛిన్నకర పాలన ధోరణులు రోజు రోజుకు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలను విభజించే కుట్రలను సమష్టిగా తిప్పికొట్టాల్సిన అవసరాన్ని కుమారస్వామికి సీఎం కేసీఆర్‌ వివరించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రమాదకర స్వార్థ రాజకీయ పంథా, దాని పర్యవసానాలపై ఇరువురు నేతలు తీవ్ర ఆవేదనను వ్యక్తంచేశారు. దేశాన్ని మత విద్వేషపు ప్రమాదకర అంచుల్లోకి నెట్టకుండా కాపాడుకుంటామని ఏకాభిప్రాయం వ్యక్తంచేశారు. దేశ ప్రజాస్వామిక సమాఖ్యస్ఫూర్తిని రక్షించేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులన్నీ ఐక్యం కావాల్సిన అవసరమున్నదని గుర్తించారు. బీజేపీకి ప్రత్యామ్నాయంకోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని కుమారస్వామి సీఎం కేసీఆర్‌తో అన్నారు. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి, దేశ గుణాత్మక ప్రగతికోసం చేసే కృషికి తమ సహకారాన్ని అందిస్తామని, అందుకోసం రాజకీయ పార్టీని స్థాపిస్తే తమ సంపూర్ణ మద్దతుంటుందని కుమారస్వామి తెలిపారు. బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ అనే అభిప్రాయం దేశ ప్రజల్లో సన్నగిల్లిందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామిక సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లేలా ప్రాంతీయ పార్టీల ఐక్యత నేటి దేశ రాజకీయ తక్షణావసరమని ఇరువురు అభిప్రాయపడ్డారు.

జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి, తెలంగాణ మాదిరిగానే దేశాన్ని కూడా నడిపించాలని తనపై రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతున్నదని సీఎం కేసీఆర్‌.. కుమారస్వామికి వివరించారు. మతతత్వ బీజేపీపై, మోదీ ప్రజావ్యతిరేక నిరంకుశ వైఖరిపై పోరాడాలని ప్రజలు హర్షధ్వానాలతో జిల్లాల పర్యటనల సందర్భంగా ప్రతిచోటా బహిరంగసభలో తమ మద్దతు తెలియజేస్తున్నారని తెలిపారు. ప్రగతిపథంలో నడుస్తున్న తెలంగాణను నిత్యం ఇబ్బందులకు గురిచేస్తూ అనేకరకాలుగా ఆటంకాలు సృష్టిస్తున్న బీజేపీపై ప్రజలు పూర్తి వ్యతిరేక ధోరణితో ఉన్నారన్నారు. చివరకు తమ సొంత టీఆర్‌ఎస్‌ నేతలు కూడా గ్రామస్థాయి నుంచీ, జిల్లా, రాష్ట్ర స్థాయి అధ్యక్ష, కార్యదర్శి వర్గాలు కూడా జాతీయ పార్టీని స్థాపించి, బీజేపీని ఇంటికి సాగనంపాలని ముక్తకంఠంతో తీర్మానాలు చేస్తున్నాయని కేసీఆర్‌ వెల్లడించారు.

వ్యవసాయాధారిత భారతదేశంలో తెలంగాణ తీరుగానే సాగుకు నిరంతర ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా, రైతు రుణాల మాఫీతో సహా వ్యవసాయ అభివృద్ధి పథకాలన్నింటినీ దేశమంతా అమలు చెయ్యొచ్చని తెలిపారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో కేంద్రపాలకులు వహించిన నిర్లక్ష్యాన్ని కుమారస్వామితో చర్చించారు. రైతులకు వ్యతిరేకంగా, దేశీయ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ దమననీతిని వారు ఖండించారు. జాతీయ రైతు సంఘాల నేతలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలు ఇటీవలే రాష్ట్రాన్ని సందర్శించి, క్షేత్రస్థాయిలో పర్యటించారని కుమారస్వామికి కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణ అమలు చేస్తున్న సాగునీరు, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాల గురించి తెలుసుకొని వారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారన్నారు. దేశమంతా 24 గంటలు ఉచిత విద్యుత్తు, సాగునీరు, రైతుబంధు, రైతుబీమా అందేలా చర్యలు చేపట్టాలని, అందుకు జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి రైతురాజ్య స్థాపనకు కృషిచేయాలని వారు డిమాండ్‌ చేసినట్టు వివరించారు. తనతో మూడు రోజులపాటు జరిగిన చర్చల విషయాన్ని కుమారస్వామికి కేసీఆర్‌ తెలియజేశారు.

కేసీఆర్‌ త్వరలో స్థాపించబోయే జాతీయ పార్టీ ఎజెండాపై కూడా ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. దేశ చరిత్రనే వక్రీకరిస్తూ బీజేపీ కొనసాగిస్తున్న విధ్వంసకర రాజకీయ ఎత్తుగడలను తుత్తునియలు చేయలేని పక్షంలో దేశంలో రాజకీయ, పాలనా సంక్షోభం తప్పదనే విషయాన్ని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. కులమతాలకు, ప్రాంతాలకు అతీతంగా సకల వర్గాలను కలుపుకొనిపోతూ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. మౌలిక సమస్యలను గాలి కొదిలి, భావోద్వేగాలతో పబ్బం గడుపుకొనే బీజేపీ పాలనకు చరమగీతం పాడాలని, అందుకు రాబోయే సార్వత్రిక ఎన్నికలనే వేదికగా మలచుకోవాలనే ఏకాభిప్రాయానికి వారు వచ్చారు. 75 ఏండ్లుగా సాగుతున్న మూస రాజకీయాలకు దేశ ప్రజలు విసుగెత్తిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. వర్తమాన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు సరిపడే చైతన్యవంతమైన పాలన అవసరం ఉన్నదని క్షేత్రస్థాయినుంచి ఫీడ్‌ బ్యాక్‌ వస్తున్న విషయం వారి చర్చలో ప్రస్తావనకు వచ్చింది. పలు దేశాలలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, అభివృద్ధి దిశగా ఆయా దేశాలు అనుసరిస్తున్న విధానాలపై కుమారస్వామితో సీఎం కేసీఆర్‌ చర్చించారు. జాతీయ సమస్యలపై స్పందిస్తూ ఢిల్లీ కేంద్రంగా జరిపిన చర్చలతోపాటు, తాను చేపట్టిన పలు రాష్ట్రాల పర్యటనల సందర్భంగా ఆయా రాష్ట్రాల ప్రజలు పలికిన ఆహ్వానాల తీరుతెన్నులపైనా చర్చించారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించడానికి ముందు సాగిన అభిప్రాయ సేకరణ మాదిరిగానే ఇప్పటికే మేధావులు, ఆర్థిక వేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సుదీర్ఘంగా చర్చలు కొనసాగించి, ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాపై ఏకాభిప్రాయాన్ని సాధించగలిగామని, త్వరలోనే జాతీయ పార్టీ ఏర్పాటు, విధివిధానాల రూపకల్పన జరుగుతుందని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌.. కుమారస్వామిని శాలువా, జ్ఞాపికతో సత్కరించి సాదరంగా వీడ్కోలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *