mt_logo

ప్రపంచంలో అతిపెద్ద కమ్యూనిటీ స్క్రీనింగ్ కంటి వెలుగు కార్యక్రమం : మంత్రి హరీష్ రావు 

ప్రపంచంలోనే అతి పెద్ద కమ్యూనీటి స్క్రీనింగ్ కంటి వెలుగు కార్య‌క్ర‌మం అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో దృష్టి లోపంతో బాధ‌ప‌డుతున్న వారి లోపాల‌ను నివారించేందుకే కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. కంటి వెలుగు కార్యక్రమం అమలు ప్రణాళికపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులతో జగిత్యాల కలెక్టరేట్ నుండి మంత్రి హ‌రీశ్‌రావు వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో వైద్యారోగ్య శాఖ క‌మిష‌న‌ర్ శ్వేత‌, ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస్, జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్ మందా మ‌క‌రంద్ ప్ర‌త్య‌క్షంగా పాల్గొన్నారు. హైద‌రాబాద్ నుంచి వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి రిజ్వి హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుంద‌న్నారు. కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. జిల్లాల్లో కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రభావవంతంగా నిర్వహించేందుకు సూక్ష్మ స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాల‌ని ఆదేశించారు. వచ్చే జనవరి 18న రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు -2 కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంద‌న్నారు.

మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం 8 నెలల పాటు నిర్వ‌హించామ‌ని, రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం వంద వర్కింగ్ డేస్‌లలో పూర్తి చేయాల‌న్నారు. కంటి వెలుగు-2 కార్యక్రమంలో గతం కంటే టీమ్‌లు పెంచాం. 1500 టీమ్‌ల‌ను ఏర్పాటు చేస్తున్నాం. మున్సిపల్, పంచాయితీరాజ్ అధికారులతో చర్చించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్లాన్ చేసుకోవాలి. కంటి వెలుగు -2 కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను క్రియాశీలక భాగస్వామ్యం చేయాలి. జిల్లాల్లో మైక్రో ప్లానింగ్ పూర్తి అయిన తర్వాత జిల్లా ఇంఛార్జి మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులతో జిల్లా వారీగా మీటింగ్ ఏర్పాటు చేయాలి. ఏ రోజు ఎక్కడ‌ క్యాంపు నిర్వహించాలో పకడ్బందీ కార్యాచరణ సిద్ధం చేయాలి. తెలంగాణలో ఈ కార్యక్రమం క్రింద 3 కోట్ల మందిని స్క్రీన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని తెలిపారు.

 ప్రతి జిల్లాలో 5 శాతం బఫర్ టీమ్ ( అడ్వాన్స్ టీమ్) లు పెట్టుకోవాలి. 960 వైద్యులను వారం రోజుల్లోగా కొత్తగా నియమాకాలు చేస్తున్నాం. రెగ్యులర్ వైద్య ఆరోగ్య శాఖ కార్యకలాపాల కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.   మండల, జిల్లా, పురపాలక సంఘం స‌మావేశాల్లో కంటి వెలుగుపై చర్చించి ప్రజా ప్రతినిధులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాలన్నారు. రూ. 200 కోట్లు నిధులను ఈ కార్యక్రమానికి ప్రభుత్వం మంజూరు చేసింది. దృష్టి లోపాలతో బాధపడే వారికి కంటి అద్దాలు పంపిణీ చేయాలి. గ్రామ, మండల , జిల్లా స్థాయిలో కంటి వెలుగు -2 కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించాల‌ని హ‌రీశ్‌రావు సూచించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *