mt_logo

దయాకర్‌ను భారీ మెజారిటీతో గెలిపించండి- కడియం శ్రీహరి

వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికకు పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ ను గెలిపించాలని కోరుతూ గురువారం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పరకాల మండలం వెల్లంపల్లిలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, అభ్యర్థి పసునూరి దయాకర్ తో కలిసి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తుంటే ఓర్వలేని ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని, ఉప ఎన్నికలో ఓట్లతో ప్రతిపక్షాలకు తగిన గుణపాఠం చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

సమైక్య పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకపడిందని, పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని కడియం పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులు దొరక్క స్థానికేతరులకు టిక్కెట్ ఇచ్చాయని, కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఉద్యమంలో మొదటినుండి ఉన్న మారుమూల గ్రామానికి చెందిన పసునూరి దయాకర్ కు టిక్కెట్ ఇచ్చారని, భారీ మెజారిటీతో దయాకర్ ను గెలిపించాలని కోరారు. అనంతరం అభ్యర్థి దయాకర్ మాట్లాడుతూ, సాధారణ చిత్రకారుడినైన తనను సీఎం కేసీఆర్ ప్రోత్సహించి ఉద్యమంలో మమేకం చేశారని, ఇప్పుడు ఎంపీ టిక్కెట్ ఇచ్చారని అన్నారు. తనను ఆశీర్వదించి పార్లమెంట్ కు పంపించాలని, ప్రజల ఆకాంక్ష మేరకు అభివృద్ధి చేస్తానని దయాకర్ హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *