mt_logo

బ్రిటిష్ సౌత్ ఇండియన్ బిజినెస్ మీట్

బ్రిటిష్ సౌత్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కామర్స్(BSICC) మరియు తెలంగాణ ఎన్నారై ఫోరమ్(TeNF)- యూకే శాఖ సంయుక్తంగా లండన్‌లోని బ్రిటిష్ పార్లమెంట్‌లో “బ్రిటిష్ సౌత్ ఇండియన్ బిజినెస్ మీట్” (British South Indian Business Meet) నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాల ప్రతినిధులు, స్థానిక బ్రిటన్ ఎంపీ వీరేంద్ర శర్మతో పాటు ఇతర ఎంపీలు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రం నుండి భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ గారు, తెలంగాణ టూరిజం సెక్రెటరీ బుర్ర వెంకటేశం గారు, ఎండీ డాక్టర్ క్రిస్టీన మరియు తెలంగాణ ఎన్నారై ఫోరమ్ అధ్యక్షుడు సిక్క చంద్రశేఖర్ గౌడ్
వ్యవస్థాపక సభ్యుడు- ఎన్నారై టీ.ఆర్.యస్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, అడ్వైజరి బోర్డ్ ఛైర్మన్ ఉదయ్ నాగరాజు పాల్గొన్నవారిలో ఉన్నారు.

బ్రిటన్ ఎంపీ మరియు BSICC పాట్రన్ వీరేంద్ర శర్మ ముందుగా స్వాగతోపన్యాసం ఇస్తూ భారత-యూకే దేశాల మధ్య ఉన్న మంచి వ్యాపార అనుకూల విధానాల గురించి వివరించి, వాటిని సద్వినియోగం చేసుకోవాలని హాజరైన అన్ని రాష్ట్రాల ప్రతినిధులని కోరారు. ముఖ్యంగా తెలంగాణ ప్రతినిధులని ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకొనిపోతున్న తీరును అభినందించారు.

భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర విశిష్టత, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, గణాంకాలతో సహా.. ఐ.టి, ఫార్మా, ఫుడ్ ప్రోసెసింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పవర్, నీళ్ళు.. ప్రతి రంగంలో గత సంవత్సరకాలంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సరికొత్త నూతన పారిశ్రామిక విదానం టీయస్ఐపాస్(TSiPass) విధివిధానాల గురించి వివరించారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం- ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవినీతి లేని పెట్టుబడులకి అనుకూల నిర్ణయాలన్ని సభకు వివరించారు. రోజురోజుకు అభివృద్ధిలో హైదరాబాద్ దూసుకెళ్తున్న తీరు గురించి ప్రత్యేకంగా వివరించారు. నేడు రాష్ట్రంలో ప్రారంభమైన భారతదేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ హబ్(T-HUB) గురించి ప్రత్యేకంగా వివరించారు.

నేడు భారతదేశంలో అన్ని రంగాల్లో పెట్టుబడులకి కేవలం తెలంగాణ ఒక్కటే అనువైన రాష్ట్రమని, కావున తెలంగాణకి పెట్టుబడులతో వచ్చి కలిసి ఇద్దరం ఎదుగుదామని పిలుపునిచ్చారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆహ్వానించినందుకు తెలంగాణ ఎన్నారై ఫోరమ్ సంస్థను అభినందించారు. తెలంగాణ టూరిజం సెక్రెటరీ బుర్ర వెంకటేశం గారు చక్కని ప్రెజెంటేషన్ తో పర్యాటకంగా తెలంగాణ రాష్ట్ర విశిష్టతను వివరించారు. రాష్ట్రంలో చూడవలసిన ప్రదేశాలని, చారిత్రాత్మక కట్టడాల గురించి, హైదరాబాద్ బిర్యానీతో సహా రాష్ట్రంలో ప్రత్యేకంగా లభించే ఆహార పదార్థాల గురించి వివరించారు. హైదరాబాద్ లో ప్రాముఖ్యమైన ముత్యాలు, బట్టలు, తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక సంస్కృతి, వివిధ రకాల పండుగలు, వాటి విశిష్టతను వివరించారు. “Destination for All seasons and all reasons” అని చెప్పి, పర్యాటక రంగంలో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన రాష్ట్రమని ఆహ్వానించారు.

అలాగే ఈ కార్యక్రమం నిర్వహించిన తెలంగాణ ఎన్నారై ఫోరమ్(TeNF) తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు గొప్పదని, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని అభినందిస్తూ యూకే-యూరోప్ లో “తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ” అంబాసిడర్ గా తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఉంటుందని తెలిపారు. అలాగే నేడు చారిత్రాత్మక పార్లిమెంట్ ఆవరణలో జరిగిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖను ఆహ్వానించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

చివరిగా తెలంగాణ ఎన్నారై ఫోరమ్ అధ్యక్షుడు సిక్క చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. BSICC యాజమాన్యానికి, ఎంపీ నర్సయ్య గౌడ్ గారికి, బుర్ర వెంకటేశం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో BSICC కో ఆర్డినేటర్ సుజిత్ నాయర్, తెలంగాణ ఎన్నారై ఫోరమ్ అధ్యక్షుడు సిక్క చంద్రశేఖర్ గౌడ్, వ్యవస్థాపక సభ్యుడు- ఎన్నారై టీ.ఆర్.యస్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, అడ్వైజరి బోర్డ్ ఛైర్మన్ ఉదయ్ నాగరాజు, తెలంగాణ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ప్రతినిధి విజయ్ చౌదరి, స్టీరింగ్ కమిటీ సభ్యుడు గణేశ్, ఉపాధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, సభ్యులు రత్నాకర్, నవీన్ రెడ్డి పాల్గొన్నవారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *