టూరిజం, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తెలంగాణ ఫెస్టివల్ ను ఐటీ మంత్రి కేటీఆర్ బుధవారం సాయంత్రం పార్క్ హోటల్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకే తెలంగాణ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు, పది జిల్లాల కళలు, పంటలు, వంటలను ఒక వేదికపై తెచ్చి ప్రదర్శనలో పెట్టామని అన్నారు.
తెలంగాణలోని యక్షగానం, డోలు, ఖవ్వాలి, ఒగ్గు, గొత్తికోయ, కొమ్ము నృత్యం తదితర అంశాలను తెలంగాణ ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఉంచామని మంత్రి చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే క్రమంలో ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, రానున్న కాలంలో మరిన్ని కార్యక్రమాలతో ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కళారూపాలను, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి ఎలుగెత్తి చాటనుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ మంత్రి చందూలాల్, ఎంపీ బాల్క సుమన్, ప్రభుత్వ సలహాదారు పాపారావు తదితరులు పాల్గొన్నారు.