mt_logo

టీఆర్ఎస్ ఉద్యమం లేకుంటే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చేదా?

శుక్రవారం మెదక్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జిల్లాలో రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ నాయకులు మంత్రి పదవులు అనుభవిస్తూ ఏసీ గదులను వదలకుండా అంటిపెట్టుకుని ఉన్నారని, తెలంగాణ కోసం ఉద్యమించింది టీఆర్ఎస్ పార్టీ, జేఏసీ, తెలంగాణ ప్రజలేనని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏనాడూ ఉద్యమం చేయలేదని, తెలంగాణ ఉద్యమం సమయంలో కాంగ్రెస్ నేతలు ఎక్కడికెళ్ళారని, తెలంగాణ తెచ్చింది మేమే అని చెప్తున్న కాంగ్రెస్ నేతలు ఉద్యమకారులపై కేసులు పెట్టించిన విషయం ప్రజలింకా మర్చిపోలేదని గుర్తుచేశారు. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడిపైనా కేసులు లేవని, మేమే జైలుకు వెళ్లామని, టీఆర్ఎస్ ఉద్యమం, బలిదానాలు లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చేదా? అని ప్రశ్నించారు. టీడీపీ పార్టీకి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయని, ఆ పార్టీకి ఓటేస్తే మురిగిపోవడమే అని సూచించారు. ఆంధ్రా ఉద్యోగులు ఇక్కడ ఒద్దని కేసీఆర్ అంటుంటే పొన్నాల, చంద్రబాబు మాత్రం ఇక్కడే ఉండాలని అంటున్నారని, తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ఆంధ్రా ఉద్యోగులు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారని, మెదక్ జిల్లా జోగిపేటలో బహిరంగసభ నిర్వహించనున్నారని తెలిపారు. అదే సభలో కొందరు ప్రముఖులు పార్టీలో చేరుతున్నారని, చుట్టుపక్కల ప్రాంతాలనుండి కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *