రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఉచితంగా ఇళ్ళ స్థలాలను క్రమబద్ధీకరిస్తూ పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం ప్రారంభించనున్నారు. మరోవైపు జిల్లాల్లో అందుబాటులో ఉన్న మంత్రులు, జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల్లో ఇళ్ళ పట్టాలను పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న పేదల్లో 125 గజాలలోపు స్థలాలు ఆక్రమించుకుని ఉన్నవారికి ప్రభుత్వం జీవో 58 కింద ఆ స్థలాలను ఉచితంగా క్రమబద్దీకరించి పేదలకు అందజేయనుంది. ఈ జీవో కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం మొదటిదశలో రాష్ట్రవ్యాప్తంగా 1.28 లక్షల పట్టాల పంపిణీకి ప్రణాళిక రూపొందించింది.
శుక్రవారం ఉదయం 11.30 గంటలకు మల్కాజిగిరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగే కార్యక్రమంలో మల్కాజిగిరికి చెందిన 3,300 కుటుంబాలు ఈ ఇళ్ళ పట్టాలను సీఎం కేసీఆర్ చేతులమీదుగా అందుకోనున్నారు. అనంతరం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎన్ బీటీ నగర్ లో సాయంత్రం 5.15 గంటలకు స్థానిక ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్స్ లో జరిగే కార్యక్రమంలో 7,000 కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇళ్ళ పట్టాలు అందజేస్తారు. ఈ పట్టాలపై సదరు స్థలాలను కొనగూడదు.. అమ్మకూడదు అని ముద్రించి ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఈ పట్టాలకు సంబంధించి ఎలాంటి అవినీతి జరగకుండా, మరోచోట ఆక్రమణలకు పాల్పడకుండా పట్టాలపై ఆధార్ నంబరును పొందుపర్చనున్నామని రెవెన్యూ అధికారులు తెలిపారు.