హైదరాబాద్ నగరంలో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలకు మొదట గోల్కొండ బోనాలతో గురువారం అంగరంగ వైభవంగా అంకురార్పణ జరిగింది. లంగర్హౌజ్ చౌరస్తా వద్ద బంగారు బోనానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ…. దీపం వెలిగించి పూజలు నిర్వహించి తొట్టెలకు స్వాగతం పలికారు. అనంతరం శ్రీ జగదాంబిక అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువ్రస్తాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. నగరంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందని… బోనాల ఉత్సవాలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని ప్రార్థించామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.

