mt_logo

ఎంపీ సంతోష్ కుమార్ కు ‘సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు’

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను ‘సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు’ వరించింది. బెంగళూరులోని వసంత్ నగర్ డాక్ట‌ర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో పద్మశ్రీ సాలుమారద తిమ్మక్క 111వ జన్మదిన వేడుక‌ల సంద‌ర్భంగా తిమ్మక్క చేతుల మీదుగా అవార్డును సంతోష్ కుమార్ అందుకున్నారు. సాలుమారద తిమ్మక్క ఇంటర్నేష‌న‌ల్ ఫౌండేషన్, శ్రీ సిద్ధార్ధ ఎడ్యుకేషనల్ సొసైటీ క‌లిసి 2020 సంవత్సరానికి గాను దేశంలో అత్యుత్తమ సామాజిక సేవలు అందిస్తున్నవారికి అవార్డుల‌ను అంద‌జేసింది. ఈ అవార్డుల్లో ప్రకృతి పరిరక్షణ విభాగంలో జోగినిపల్లి సంతోష్ కుమార్ అవార్డును అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో అత్యుత్తమ ప్రకృతి సేవకురాలు, ఆధ్యాత్మిక గురువు ఆధ్వర్యంలోని కమిటీ త‌న‌ను ఇంతటి అద్భుతమైన సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డుకు ఎంపిక చేయడం త‌న పూర్వజన్మ సుకృతం అయింద‌న్నారు. సీఎం కేసీఆర్ నడిచిన బాటలో అడుగులో అడుగేస్తూ.. త‌న వంతుగా ఏదైనా చేయాలనే సంకల్పంతో సరిగ్గా ఐదేళ్ల క్రితం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించాన‌ని తెలిపారు. ఈ అవార్డు తనకు మరింత బాధ్యతను పెంచింద‌న్నారు. ఈ వర్షాకాలం సీజన్‌లో ప్రతీ ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *