మునుపెన్నడూ లేనివిధంగా ఒకేరోజు 200 మంది అటవీశాఖ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ‘జంగల్ బచావో.. జంగల్ బడావో’ అనే నినాదంతో స్మగ్లర్లు, అటవీ నేరగాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటూ ముందుకువెళ్తున్న ప్రభుత్వం అటవీశాఖలో జరుగుతున్న అవినీతిపై ఉక్కుపాదం మోపింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిసున్న అధికారులు, సిబ్బందిపై బదిలీ వేటు వేసింది. ఐఎఫ్ఎస్, డీఎఫ్ వో, ఎఫ్ డీవో, ఏసీఎఫ్, చీఫ్ కన్జర్వేటర్లు, కన్జర్వేటర్లు స్థాయి అధికారులను పెద్దసంఖ్యలో బదిలీచేస్తూ ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. ఉన్నతాధికారులు కేవలం హైదరాబాద్ నుండే పరిస్థితిని పర్యవేక్షించకుండా క్షేత్రస్థాయిలో దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు.
అడవుల సంరక్షణ విస్మరించి స్మగ్లర్లతో కుమ్మక్కైన అధికారులు, సిబ్బంది జాబితాను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించిన మీదట ఉన్నతాధికారులు పలువురి పేర్లతో లిస్టు రూపొందించి ఆ జాబితాను సీఎం కేసీఆర్ కు అందజేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సదరు అధికారుల బదిలీలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రశాంత్ కుమార్ ఝా మంగళవారం ఆయా అధికారులకు బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు.