mt_logo

మానవబాంబులా కాదు.. మానవీయంగా ప్రవర్తించు: రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్

దుబ్బాక నియోజకవర్గంలో నిర్వహించిన మెదక్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..గులాబీ జెండాకు తొలి నుంచి అడ్డా దుబ్బాక గడ్డ.. ఉద్యమకారుల అడ్డా దుబ్బాక గడ్డ.. తొలి నుంచి బీఆర్ఎస్‌ను ఆదరిస్తున్న దుబ్బాక ప్రజలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు అని అన్నారు.

కాంగ్రెస్.. కొంతమంది నాయకులను కొనొచ్చుగాని ఉద్యమకారులను, బీఆర్ఎస్ కార్యకర్తలను, ప్రజలను కొనలేదు.. దుబ్బాకకు సాగునీరు, తాగునీరు తెచ్చింది బీఆర్ఎస్.. కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదు అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ అబద్ధాలను, మోసాలనే ప్రజల్లోకి తీసుకెళ్లి అర్థం చేయించండి.. ప్రజలు మోసపోకూడదు.. ఆరు గ్యారంటీలను అమలు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ హయాంలో ఏదో జరిగిందని అబద్ధాలు ప్రచారం చేస్తోంది.. 6 గ్యారంటీలు అమలుచేసే వరకు అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తం.. కాంగ్రెస్ మెడలు వంచి హామీలను అమలు చేయిస్తం అని హరీష్ స్పష్టం చేశారు.

రేవంత్ ఇంకా ప్రతిపక్ష నాయకుడిలాగే మాట్లాడుతున్నాడు.. మానవబాంబులా కాదు.. మానవీయంగా ప్రవర్తించు రేవంత్ రెడ్డి. వందరోజుల పాలన చూసి ఓటేయమని రేవంత్ అడుగుతున్నాడు.. మరి వందరోజుల్లో ఎన్నికల హామీలను అమలు చేసిండా అని ప్రశ్నించారు.

రూ. 4 వేల పింఛన్, రైతుబంధు, తలం బంగారం, వడ్లకు బోనస్ వచ్చిందా? రాలేదు.. ఎన్నో గడువులు దాటిపోయినా ఏవీ అమలు కాలేదు.. అందుకే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చురుకు పెట్టాలే అని పిలుపునిచ్చారు.

దుబ్బాక ఉప ఎన్నికలో బూటకపు హామీలిచ్చి గెలిచిన రఘునందన్ రావు కూడా మళ్లీ మోసం చేయడానికి వస్తున్నాడు.. నిరుద్యోగ భృతి, రెండు ఎడ్లు, నాగలి ఏవేవో ఇస్తామని మాట తప్పిండు అని హరీష్ గుర్తు చేశారు.

కష్టకాలంలో బీఆర్ఎస్‌కు పార్టీకి ద్రోహం చేసినోళ్లు కన్నతల్లికి ద్రోహం చేసినట్టే.. పోయినవాళ్లు కాళ్లు మొక్కినా మళ్లీ చేర్చుకోం. మధ్యలో వచ్చినవాళ్లు, పవర్ బ్రోకర్లు మాత్రమే పోతున్నారు.. కార్యకర్తలు వెళ్లడంలేదు.. ఇది శిశిరకాలం.. పనికిరాని ఆకులు పోతాయి, కొత్త చిగురు వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఉన్నంతవరకు బీఆర్ఎస్ ఉంటుంది అని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సిద్దిపేట జిల్లా అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డారు.. దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు.. పేదలకు సాయం చేసే పెద్ద మనసు ఉంది అన్ అన్నారు.

విద్యావంతుడైన, కలెక్టర్‌గా పనిచేసిన ఆయనను గెలిపిస్తే ఢిల్లీలో మన గళం బలంగా వినిపిస్తాడు.. దుబ్బాకకు, మెదక్‌కు నిధులు తెప్పిస్తాడు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. కార్యకర్తలు ఆయన విజయానికి కష్టపడి పనిచేయాలి అని హరీష్ కోరారు.