mt_logo

తెలంగాణ గొంతుక, ఆత్మగౌరవ ప్రతీక బీఆర్ఎస్‌ను గెలిపించుకోవాలి: సిద్దిపేటలో హరీష్ రావు

సిద్దిపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. రానే రాదన్న తెలంగాణను కేసీఆర్ సాధించి పెట్టాడు కేసీఆర్.. కేసీఆర్ లేని తెలంగాణను ఊహించలేం. కేసీఆర్ చెంత ఉన్న నాయకులను కాంగ్రెస్ ఇదివరకు కూడా తీసుకెళ్లింది అని గుర్తు చేశారు.

కాంగ్రెస్ కొంతమంది నాయకులను కొంటుందేమోగాని బీఆర్ఎస్ కార్యకర్తలను కొనలేదు.. పార్టీ ద్వారా పదవులు పొంది ద్రోహం చేసినవాళ్లను తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు.

సిద్దిపేట కార్యకర్తలకు ఇది పరీక్ష.. నా ఎన్నిక కోసం మీరు ఎంత కష్టపడ్డారో వెంకట్రామిరెడ్డి గెలుపు కోసం కూడా అంతే కష్టపడాలని కోరుతున్నా.. నాకొచ్చినంత మెజారిటీతో ఆయనను గెలిపించాలి అని హరీష్ కోరారు.

సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకున్నవాళ్లు ఈ రోజు ఇక్కడికొచ్చి సిగ్గులేకుండా ఓట్లు అడుగుతున్నారు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్క హామీని కూడా అమలు చేయని కాంగ్రెస్‌కు ఎంపీ ఎన్నికల్లో ఓట్లడిగే అర్హత లేదు అని అన్నారు.

రూ. 2 లక్షలు రుణమాఫీ అయినోళ్లు కాంగ్రెస్‌కు ఓటు వేయండి, కానివాళ్లు బీఆర్ఎస్‌కు ఓటు వేయండి. యాసంగి వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ బాండు పేపర్లు ఇచ్చింది. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? కారుకు ఓటేసి వాళ్లకు గుణపాఠం నేర్పాలి.. ఇప్పుడు వడ్లు వస్తున్నా రైతుబంధు రూ. 15 వేలు ఇంకా ఇవ్వలేదు.. రూ. పది వేలు కూడా రాలేదు.. రూ. 15 వేల రైతుబంధు వచ్చినోళ్లు కాంగ్రెస్‌కు, రాని వాళ్లకు బీఆర్ఎస్‌కు ఓటు వేయాలి అని పేర్కొన్నారు.

అవ్వా తాతలకు, బీడీ, గీత కార్మికులకు.. ఇతర పింఛనుదారులకు రూ. 4 వేల పింఛన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది.  వాళ్లందరికీ ఈ విషయం వివరించాలి.. వంద రోజుల్లో హామీలను అమలుచేస్తామని మాట తప్పిన కాంగ్రెస్‌కు మళ్లీ ఓటేసి మోసపోవద్దు అని పిలుపునిచ్చారు.

సిద్దిపేటలో అభివృద్ధిని రేవంత్ అడ్డుకుంటున్నారు. నేను శాంక్షన్ చేసిన వెటర్నరీ కాలేజీని కొండంగల్‌కి తరలించాడు. శిల్పారామం, అల్లీపూర్ డబుల్ రోడ్డు పనులను మధ్యలోనే అడ్డుకొని నిధులను కొడంగల్‌కు తరలిస్తున్నాడు.. కొడంగల్‌కు నువ్వు ఏమైనా తీసుకుపో.. కానీ సిద్దిపేటకు వచ్చినవి తీసుకపోతే చూస్తూ ఉరుకోం అని హరీష్ రావు హెచ్చరించారు.

సిద్దిపేట ప్రజలు కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు చేస్తారు.. సిద్దిపేట మీద రేవంత్‌కు ఇంత పగ ఎందుకు.. కేసీఆర్ మాట తప్పని మనిషి.. కళ్యాణలక్ష్మి, పింఛన్లు.. ఏ హామీ విషయంలోనూ మాట తప్పలేదు అని అన్నారు.

సిద్దిపేటపై బీజేపీకి ఎందుకింత ద్వేషం? రఘునందన్ దుబ్బాక నుంచి గెలిచినా ఎందుకు ఢిల్లీ నుంచి నిధులు తీసుకురాలేదు? ఇతనికి ఓటేయడం మన వేలితో మన కంటినే పొడుచుకోవడం.. ఇతడు గెలిస్తే మనకు న్యాయం చేస్తాడా? రఘునందన్ బాగా పనిచేస్తే మొన్నటి ఎన్నికల్లో 54 వేల ఓట్ల తేడాతో ఎందుకు ఓడించిన్రు? అని అడిగారు.

సిద్దిపేటలో ప్రతి అంగుళంపైనా అవగాహన ఉన్న వ్యక్తి వెంకట్రామిరెడ్డి. సిద్దిపేటలో 2 వేల డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించడంలో ఆయన పాత్ర కీలకం.. పేదపిల్లలను దత్తత తీసుకుని చదివిస్తున్నాడు. విద్యావంతుడు, కలెక్టర్‌గా పనిచేసిన ఆయనను గెలిపించుకుంటే ఢిల్లీలో మన గొంతు బలంగా వినిపిస్తాడు.. నిధులు తీసుకొస్తాడు అని తెలిపారు.

సిద్దిపేట ఒక ఆలయంగా నేను పనిచేశాను.. సిద్దిపేట ప్రజలను నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాను.. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాతపెట్టాలి.. అప్పుడే వాళ్లకు తాము మోసం చేశామని తెలుస్తుంది. తెలంగాణ గొంతుక, ఆత్మగౌరవ ప్రతీక అయిన బీఆర్ఎస్‌ను గెలిపించుకోవాలి అని హరీష్ కోరారు.