mt_logo

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్

చెప్పేది కొండంత.. చేసేది గోరంత కూడా లేదు అన్నట్లుంది సీఎం రేవంత్ రెడ్డి తీరు అని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఎల్బీస్టేడియం వేదికగా నర్సింగ్ ఆఫీసర్‌లకు నియామక పత్రాల అందజేత పేరిట ఆర్భాటం చేశారు. ఊహించినట్లు గానే తామే రిక్రూట్మెంట్ చేసినట్లు డబ్బా కొట్టుకున్నారు అని పేర్కొన్నారు.

ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను వంచిందని కల్లి బొల్లి మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జరిగిన నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియను తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ తన అబద్దాల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు అని అన్నారు.

ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ ఇచ్చి, నియామక పత్రాలు ఇచ్చారా రేవంత్ రెడ్డి చెప్పాలి. మాకు కుళ్ళు లేదు కడుపులో నొప్పి లేదు. సొమ్మొక్కడిది సోకు ఇంకొకడిది అన్నట్టు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడంలో రేవంత్ వ్యవహరించిన తీరునే తప్పు బడుతున్నాం అని పేర్కొన్నారు.

కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఈ నర్సుల నియామక పత్రాలు ఇచ్చిన విషయాన్ని మరచిపోవద్దు. నర్సులుగా ఉద్యోగాలు పొందిన వారికి కూడా వాస్తవాలు తెలుసు అని గుర్తు చేశారు.

తెల్లారితే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తారనుకున్న నిరుద్యోగుల ఆశలపై రేవంత్ రెడ్డి నీళ్ళు చల్లారు. అయన ప్రసంగంలో దీని గురించి ఒక్క మాట లేదు. ఎన్నికల సమయంలో ఫిబ్రవరి ఒకటవ తారీఖున గ్రూపు 1 నోటిఫికేషన్ ఇస్తామని ప్రచారం చేశారు. పత్రికల్లో మొదటి పేజీలో ప్రకటనలు గుప్పించారు. ఇప్పుడు నోరూమెదపడం లేదు అని దుయ్యబట్టారు.

మేము యదార్థం చెబితే, శాపనార్థాలు అని మాట్లాడారు తప్ప నోటిఫికేషన్ల గురించి చెప్పలేదు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్ని నీటి మూటలే అని రేవంత్ రెడ్డి మరోసారి నిరూపించారు అని హరీష్ రావు అన్నారు.

రూ. 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు పెంపు, రూ. 500 లకు సిలిండర్, రూ. 4,000 నెలవారీ పించన్, మహాలక్ష్మి ద్వారా రూ. 2500, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నిరుద్యోగ భృతి వంటి అమలు కానీ హామీల లిస్ట్‌లో నేడు జాబ్ క్యాలెండర్ కూడా చేరింది అని పేర్కొన్నారు.

అసలు ఉద్యోగాల గురించి, నిరుద్యోగుల బాధల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడిది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసింది 10 వేల ఉద్యోగాలు మాత్రమే కాదా? అపుడు నిరుద్యోగ యువత ను మోసం చేసింది చాలక ఇపుడు మరో సారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది ఎవరు? అని ప్రశ్నించారు.

ఉద్యోగ నియామకాల్లో మా ప్రభుత్వం రికార్డు సృష్టించింది. తొమ్మిదనరేళ్లలో లక్షా 65 వేల ఉద్యోగాలను భర్తీ చేయగా, మరో 40 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నది వాస్తవం కాదా అని అడిగారు.