mt_logo

చెరి 8 సీట్లు గెలిచేలా కాంగ్రెస్, బీజేపీ ఒప్పందం చేసుకున్నాయి: హరీష్ రావు

హైదరాబాద్‌లో జరిగిన మీట్ ద ప్రెస్‌ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలను అమలు చేశాకే కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడగాలి.. కాంగ్రెస్ బాండ్ పేపర్ బౌన్స్ అయింది. అందుకు శిక్ష వేయాలని ప్రజలను నిర్ణయించారు.  అప్పుడు ప్రామిస్‌లు ఇప్పుడు దేవుళ్లపై ప్రామిస్‌లు.. హామీలు అమలు కావడడం లేదంటే చెప్పుతో కొట్టాలని దూషిస్తున్నారు అని పేర్కొన్నారు.

ఢిల్లీకి మూటలు పంపడంలో ఉన్న శ్రద్ధ హామీల అమలుపై పరిపాలనపై  లేదు. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను, ఆయన సీనియారిటీని గౌరవించకుండా రేవంత్ కళ్లు పీకుతా, పేగులు మెడలో వేసుకుంటా అని దుర్భాషలాడుతున్నారు.  కేసీఆర్ పరిపాలన వికేంద్రీకణ కోసం ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేస్తానంటున్నాడు. ఇది ముందుకు పోవడమా, వెనక్కి పోవడమా? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో పరిపాలన లేదు, పగ ప్రతీకారాలు కనిపిస్తున్నాయి. ప్రజాపాలనలో 3 లక్షల యాభైవేల దరఖాస్తులు వచ్చాయి. ఎన్ని పరిష్కరించారో శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రతిపక్షాల గొంతు నొక్కడమే పనిగా పెట్టుకున్నాడు రేవంత్.. మా సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తున్నారు అని తెలిపారు.

పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమని మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ వాటినే ప్రోత్సహిస్తోంది. 8 సీట్లలో బీజేపీ గెలిచేలా కాంగ్రెస్, 8 సీట్లలో కాంగ్రెస్ గెలిచేలా బీజేపీ ఒప్పందం చేసుకున్నాయి. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సమైక్యవాదులు అంటున్నారు.. రేవంత్ రెడ్డికి ఆంధ్రా మూలాలున్నాయి.. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించారు.

బీజేపీ, కాంగ్రెస్‌లు రాజకీయ ప్రయోజనాల కోసం ఏడు మండలాలను ఏపీకి ఇచ్చాయి. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోడానికి బీఆర్ఎస్ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు. బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదు. దేశవ్యాప్తంగా 157 మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఇస్తే రాష్ట్రానికి ఒక్కటి ఇవ్వలేదు. కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు, నవోదయ స్కూళ్లు ఇవ్వలేదు.. వడ్లు కొనాలంటే నూకలు తినండి అని  కేంద్ర మంత్రులు అన్నారు అని గుర్తు చేశారు.

కేసీఆర్ తెలంగాణను దక్షిణ భారత ధాన్యాగారంగా మార్చితే వడ్లు కొనకుండా వివక్ష చూపారు. తెలంగాణకు ఏమీ ఇవ్వని బీజేపీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుంది? ఎస్సీ, ఎస్టీ, విద్యార్థులు, నిరుద్యోగులు,మహిళలు.. ఏ ఒక్క వర్గానికీ బీజేపీ మేలు చేయలేదు ఆని హరీష్ విమర్శించారు.

కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, రైతులకు ఉచిత కరెంటు, మెడికల్ కాలేజీలు, కొత్త జిల్లాలు, కేసీఆర్ కింట్, మంచినీళ్లు, తాగు నీళ్లు ఇచ్చిండు.. బీజేపీ ఏం చేసింది. ఆదానీని ప్రపంచ కుబేరుల్లో టాప్ టెన్‌లో నిలబెట్టింది. నల్లచట్టాలు తెచ్చి లాఠీచార్జి చేసి, బాష్పవాయువు ప్రయోగించి 700 మంది రైతులను పొట్టనబెట్టుకుంది. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తామని చెప్పి మోసం చేసింది అని దుయ్యబట్టారు.

ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పారుగాని బిల్లు పెట్టలేదు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టింది. భక్తి ధార్మికం గురించి మాట్లాడుతున్నారు. కేసీఆర్ కంటే ధార్మికుడు మరొకరున్నారా.. అద్భుతంగా యాదాద్రి కట్టింది కేసీఆర్. ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు కొరత రాకుండా చూశారు. ఆధ్యాత్మికంలో ఆయన బీజేపీ కంటే రెండు అడుగులు ముందు ఉన్నారు అని పేర్కొన్నారు.

కేసీఆర్ బస్సుయాత్రకు ప్రజల్లో ఆదరణ లభిస్తోంది. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కంటే బీఆర్ఎస్‌కే ఎక్కువ సీట్లు  వస్తాయి. నిశ్శబ్ద విప్లవం రాష్ట్రంలో వస్తుంది. రివర్స్ గేర్లో పోతున్న కాంగ్రెస్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని అన్నారు.

రాష్ట్రం దివాలా తీసిందనే ముఖ్యమంత్రే చెబితే పెట్టుబులు వస్తాయా? రేవంత్ మాటల వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గింది.. పరిశ్రమల వాళ్ళు ఇబ్బందుల పడుతున్నారు. కేసీఆర్ హయాంలో నీళ్లు , కరెంటు పుష్కలంగా ఉండంతో ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులు వచ్చాయి.. ఇప్పుడా పరిస్థితి లేదు. మీకు పాలన చేతకాక రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్తున్నారు. గత ప్రభుత్వంపై బురదచల్లుతూ రాష్ట్రం పరువు తీస్తున్నారు అని ధ్వజమెత్తారు.

రేవంత్ బీజేపీలో చేరతారని అర్వింద్, మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. దీన్ని రేవత్ ఎందుకు ఖండించడం లేదు. కవిత అరస్ట్ కాలేదు కనుక బీజేపీ బీఆర్ఎస్ ఒకటని అబద్ధాలు చెప్పి  మైనారిటీ ఓట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు కవిత అరెస్టయ్యారు, కుక్మక్కయితే ఎందుకు అరెస్ట్ అవుతారు అని హరీష్ అడిగారు.

రేవంత్ మైనారిటీలను మోసం చేస్తున్నారు. కేబినెట్లో మైనారిటీని తీసుకోలేదు.. రంజాన్ తోఫా నిలిపేశారు.. ఇమామ్ వేతనాలు రావడం లేదు. రేవంత్ మోదీని బడే భాయ్ అంటూ ఆశీర్వాదాలు కోరుతున్నారు అని తెలిపారు.

బీఆర్ఎస్ అన్ని వర్గాల పార్టీ.. మైనారిటీలకు అన్యాయం జరిగితే పోరాడుతుంది. హిందూ, ముస్లింలను రెండు కళ్లలా చూసే పార్టీ బీఆర్ఎస్. బీఆర్ఎస్‌ను ఆదరించాలని ముస్లింలను, క్రైస్తవులను ఇతర మైనారిటీలను కోరుతున్నా అని అన్నారు.

కాంగ్రెస్ హామీలు అమలు కావాలంటే ప్రశ్నించే గొంతుకను గెలిపించాయి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం బీఆర్ఎస్‌తోనే సాధ్యం అని స్పష్టం చేశారు.