mt_logo

అయిదేళ్లలో కరీంనగర్‌కు బండి సంజయ్ చేసిందేమీ లేదు: కరీంనగర్‌లో హరీష్ రావు

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌కు మద్దతుగా కరీంనగర్‌లో రోడ్ షోలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కరీంనగర్‌లో చదువుకున్న విద్యార్ధి నేను. కరీంనగర్ బీఆర్ఎస్‌కు పుట్టినిల్లు. బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ జరిగిన అభివృద్ధి చూస్తే నా రెండు  కళ్ళు సరిపోతలేవు అని పేర్కొన్నారు.

కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు రైల్వే లైన్ మంజూరైంది.. వినోదన్న జాతీయ రహదారి సాధించారు. గత ఎన్నికల్లో బీజేపీ భావోద్వేగాలు రెచ్చగొట్టడం వల్లే బండి  సంజయ్ గెలిచాడు.. అయిదేళ్లలో బండి సంజయ్ కరీంనగర్‌కు చేసిందేమీ లేదు. వినోదన్న ఓడిపోయినా కరీంనగర్ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేశారు అని అన్నారు.

తెలంగాణ అభివృద్ధికి బీజేపీ చేసిందేమీ లేదు.. నవోదయ విద్యాయాలు ఇవ్వలేదు.. మెడికల్ కాలేజీ అడిగితే మొండిచేయి చూపించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు.. నిరుద్యోగం, పేదరికం పెరిగాయి.. పదేళ్లలో బీజేపీ చేసిన ఒక్క మంచి పని ఉంటే చెప్పండి. కరీంనగర్‌కు నర్సింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీలు తెచ్చింది బీఆర్ఎస్.. బీజేపీ వాళ్లు ఇంటికో క్యాలెండర్, చిత్రపటాలు పంచుతున్నారు.. అవి కడుపు నింపుతాయా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ వందరోజుల పాలనలోనే ప్రజలకు ఎన్నో కష్టాలు వచ్చాయి.. మంచినీళ్లు సరిగ్గా రావడం లేదు.. ఎన్నికల హమీలను అమలు చేయకుండా ప్రజలను దగా చేశారు. బాండు పేపర్లు రాసిచ్చి మరీ మోసం చేశారు. రైతులకిచ్చిన హమీలు నెరవలేరలేదు.. రూ. 4 వేల పింఛన్ ఊసే లేదు.. నిరుద్యోగభృతి ఎప్పుడు ఇస్తారని అడిగితే ఆ హామీనే ఇవ్వలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలాడుతున్నారు. మాట తప్పిన రేవంత్ రెడ్డి..ఎంపీ ఎన్నికల్లో ప్రజలు నీకు సురుకు పెడతారు అని తెలిపారు.

సొల్లు మాటలు తప్ప కాంగ్రెస్ లీడర్లు ఒక్క మంచి మాటన్నా చెబుతున్నారా.. కాంగ్రెస్‌వి ప్రజలను ఉద్ధరించే మాటలు కావు, ఉద్దెర మాటలు. కాంగ్రెస్‌కు పరిపాలన చేతకాదు, హామీలు అమలు చేయరు.. కేసీఆర్ చెడ్డి ఊడగొడుతా అంటున్నాడు రేవంత్.. నువ్వు చెడ్డి  గ్యాంగ్ వెంట తిరిగినవా.. ఇది ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా? అని హరీష్ దుయ్యబట్టారు.

కేసీఆర్ రైతుల కోసం ప్రశ్నించిండు.. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుపై తుపాకీ ఎక్కుపెట్టిండు.. ఎన్నడైనా జై తెలంగాణ అన్నాడా? ఆ పనిచేయని నువ్వు కనీసం అమరవీరుల స్తూపం వద్ద పువ్వులైనా పెట్టి నివాళులు అర్పించు అని సూచించారు.

బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని అసెంబ్లీ ఎన్నికల్లో దుష్ప్రచారం చేశారు.  కుమ్మక్కైంది బీజేపీ, కాంగ్రెసే.. బడే భాయ్, ఛోటే భాయ్ ఒక్కటయ్యారు. కరీంనగర్‌లో కాంగ్రెస్ ఇంతవరకు ఎంపీ అభ్యర్థిని ప్రకటించలేదు అని అన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయి.. చాలా చోట్ల కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థులను బరిలో దింపుతోంది. కరీంనగర్ కోసం వినోదన్న పార్లమెంటులో గొంతెత్తిండు.. ప్రజలు ఆయనను గెలిపించుకోవాలి అని పిలుపునిచ్చారు.